సత్తుపల్లిటౌన్: విద్యార్థి దశ నుంచి సమాజాన్ని నిశితంగా పరిశీలిస్తే కథారచనకు అవసరమైన అనేక అంశాలు కనిపిస్తాయని సత్తుపల్లి ప్రభుత్వ హైస్కూల్ హెచ్ఎం ఎస్కే సోందు తెలిపారు. ‘సాక్షి’దినపత్రికలో ప్రచురితమవుతున్న వేసవి వికాసం స్ఫూర్తితో గార్లపాటి – బొల్లేపల్లి ట్రస్ట్ ఆధ్వర్యాన సోమవారం పాఠశాలలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు కథా కార్యశాల ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సోందు మాట్లాడుతూ.. కథా రచనలో మెళకువలు, అవసరమైన అంశాల గుర్తింపునకు కార్యశాల ఉపయోగపడుతుందన్నారు. ఆ తర్వాత తెలుగు ఉపాధ్యాయిని రమాదేవి కథా ప్రారంభం, విస్తరణ, ముగింపులో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ట్రస్ట్ నిర్వాహకులు జి.రామకృష్ణ మాట్లాడుతూ.. వేసవిలో విద్యార్థులకు సాహిత్యంపై ఆసక్తి పెంచేలా ‘సాక్షి’ప్రత్యేక శీర్షిక నిర్వహించడం అభినందనీయమన్నారు. బాల సాహితీవేత్త బొల్లెపల్లి మధుసూదన్రాజు మాట్లాడగా ఎంఈఓ ఎన్.రాజేశ్వరరావు, పి.నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఆ తర్వాత విద్యార్థులతో ఆసక్తి ఉన్న అంశాలపై కథలు రాయించి అందులో లోపాలను సరిచేసుకోవడంపై అవగాహన కల్పించారు.
‘కథా కార్యశాల’లో వక్తలు


