ఖమ్మంఅర్బన్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు వచ్చే విద్యాసంవత్సరం నుంచి అల్పాహారం సమకూర్చనుండగా నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ సూచించారు. పోషకాలతో కూడిన అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందించడమే కాక నాణ్యత పాటించేలా జిల్లాలోని 21మండలాలకు చెందిన 42 మంది కుక్–కమ్–హెల్పర్లకు ఖమ్మం వెలుగుమట్లలోని కేజీబీవీలో సోమవారం శిక్షణ ఇచ్చారు. డీఈఓ చైతన్యజైనీ ఆధ్వర్యాన జరిగిన శిక్షణను అదనపు కలెక్టర్ పరిశీలించి మాట్లాడారు. ప్రతీ మండలం నుంచి ఎంపిక చేసిన ఇద్దరికి ఇక్కడ శిక్షణ ఇస్తుండగా, ఆ తర్వాత మండల స్థాయి రిసోర్స్ పర్సన్లుగా మిగతా వారికి శిక్షణ ఇవ్వాలని సూచించారు. విద్యార్థులకు అల్పాహారం, మధ్యాహ్న భోజనంలో నాణ్యత, పోషకాహారం ద్వారా వారు చురుగ్గా ఉంటూ చదువులో రాణిస్తారని తెలిపారు. డీఈఓ చైతన్య జైనీ మాట్లాడుతూ అల్పాహారంతో జిల్లా ప్రభుత్వ పాఠశాలల్లోని 60 వేల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుందని చెప్పారు. సెక్టోరియల్ అధికారులు రూబీ పంకజం, ప్రవీణ్కుమార్, రామకృష్ణ, ప్రభాకర్రెడ్డి, రచ్చ శ్రీనివాస్, ఎంఈఓ శైలజాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు .
వర్కర్ల శిక్షణలో అదనపు కలెక్టర్ శ్రీజ


