రఘునాథపాలెం: రఘునాథపాలెం మండలం మంచుకొండ సమీపాన ఖమ్మం– ఇల్లెందు రహదారిపై శుక్రవారం జరిగిన ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. ఘటన వివరాలిలా ఉన్నాయి. ఖమ్మం రూరల్ మండలం గోళ్లపాడుకు చెందిన ఎర్రగడ్డ నరేష్(29) బైక్పై వెళ్తుండగా ఖమ్మం నుంచి ఇల్లెందు వైపు వెళ్తున్న లారీ ముందు ఉన్న నరేష్ వాహనాన్ని ఢీకొట్టింది. అంతేకాక అదుపుతప్పి ఎదురుగా వస్తున్న కారును సైతం బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్, కారు నుజ్జునుజ్జు కాగా తీవ్రగాయాలతో నరేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. అంతేకాక కారులో ఉన్న కామేపల్లి మండలం గోవింద్రాల వాసులు మూడ్ బాలకృష్ణ – అనూష దంపతుల్లో అనూషకు తీవ్రగాయాలు కాగా, మిగతా వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదంతో రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడగా స్థానికులు క్షతగాత్రులను బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. ఆపై సమాచారం అందుకున్న ఎస్సై నరేష్ సిబ్బందితో చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు సీఐ ఉస్మాన్ షరీఫ్ తెలిపారు. కాగా, ఎర్రగడ్డ నరేష్ తన తల్లిదండ్రుల మృతితో కార్పెంటర్ పనిచేస్తూ కుటుంబ పెద్దగా నిలిచే క్రమాన ఆయన మృతితో విషాదం నెలకొంది.
బైక్ను ఢీకొట్టి కారుపైకి దూసుకెళ్లిన లారీ


