ఖమ్మంమయూరిసెంటర్: ఫీజు రీయింబర్స్మెంట్ను రద్దు చేసేలా జీఓ 7ను తీసుకురావడం ద్వారా రాష్ట్రప్రభుత్వం పేద విద్యార్థులకు వెన్నుపోటు పొడిచిందని సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్తో పాటు వివిధ పార్టీల నాయకులు పేర్కొన్నారు. ఏఐఎస్ఎఫ్ జిల్లా సమితి ఆధ్వర్యాన ఖమ్మంలో శుక్రవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సురేష్తో పాటు సీపీఎం, మాస్లైన్, న్యూడెమోక్రసీ, ఏఐఎస్ఎఫ్ నాయకులు ఎర్ర శ్రీనివాసరావు, ఆవుల అశోక్, షేక్ ఖాసిం, రావి శివరామకృష్ణ మాట్లాడారు. రాష్ట్రంలో 14 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు ఆసరాగా నిలుస్తున్న ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని రద్దు చేయాలనే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ కాలేజీల్లో ఫీజుల పెంపునకు అనుమతించగా, ఆ భారం విద్యార్థులపై పడుతుందన్నారు. ఈక్రమాన ఫీజు రీయింబర్స్మెంట్ను రద్దు చేయకుండా పెంచడంతో పాటు ఉపకార వేతనాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇంకా ఈ సమావేశంలో వివిధ పార్టీలు, సంఘాల నాయకులు అజ్మీరా రామ్మూర్తి, పుల్లయ్య, ఇటికల రామకృష్ణ, తాటి వెంకటేశ్వరరావు, మెరుగు సత్యనారాయణ, మేకల శ్రీనివాసరావు, ఝాన్సీ. నందిపాటి మనోహర్, ఏసు, జగన్, తుడుం ప్రవీణ్, గోకినపల్లి మస్తాన్, మనోజ్, నరేందర్, ఉమామహేష్ తదితరులు పాల్గొన్నారు.
ఏఐఎస్ఎఫ్ రౌండ్ టేబుల్
సమావేశంలో వక్తలు


