దమ్మపేట: దమ్మపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో రికార్డులు చోరీ జరిగిన ఘటనకు గ్రామ పంచాయితీ కార్యదర్శి అనంత్కుమార్, ఆయనతో సన్నిహితంగా ఉండే సిబ్బంది కారణమై ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తూ.. వార్డు సభ్యులు పోలీస్ స్టేషన్లో బుధవారం రాత్రి ఫిర్యాదు చేశారు. వార్డు సభ్యుల కథనం ప్రకారం.. దమ్మపేట గ్రామ పంచాయతీలో జరిగిన అక్రమ వేతనాల చెల్లింపులు, ప్రత్యేక అధికారుల పాలన కాలంలో జరిగిన తీర్మానాలు, ఎంబీలు, చెల్లింపుల వివరాలను వార్డు సభ్యులు రెండు వారాలుగా అడుగుతుండగా, కార్యదర్శి వాయిదాలు వేస్తూ, చివరకు ఈ నెల 6న ఉదయం 10 గంటలకు ఇస్తానని తెలిపారు. కాగా అదే రోజు ఉదయం 9–30 గంటలకే అట్టి వివరాలకు సంబంధించిన రికార్డులు దొంగిలించబడ్డాయని కార్యదర్శి చెప్పడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. అవకతవకలను కప్పిపుచ్చడానికే కార్యదర్శి ఈ చోరీ నాటకం ఆడుతున్నారనే అనుమానం కలుగుతుందని తెలిపారు. ఈ చోరీ ఘటనలో కార్యదర్శి, ఆయన సన్నిహిత సిబ్బంది పాత్ర ఉందనే కోణంలో విచారణ జరిపాలని కోరతూ, వార్డు సభ్యులు లిఖితపూర్వకంగా ఫిర్యాదు అందజేశారు.
పంచాయతీ పాలకవర్గ సమావేశాలకు రావొద్దు..
వార్డు సభ్యుల ఫిర్యాదు మేరకు దమ్మపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో పాలకవర్గం సమావేశాలు జరిగే సమయంలో సర్పంచ్ భర్తను రావొద్దని కార్యదర్శి అనంత్కుమార్ ఆయకే నేరుగా సూచించారు. గురువారం దమ్మపేట గ్రామ పంచాయతీ పాలకవర్గ సమావేశంలో కార్యదర్శి మాట్లాడుతూ.. పంచాయతీలో జరిగిన ఆదాయ, వ్యయ వివరాలను నేరుగా తనని సంప్రదిస్తే ఇస్తానని తెలపగా, ఇప్పటివరకు పలుమార్లు అడిగిన ఎందుకు ఇవ్వలేదని వార్డు సభ్యులు ప్రశ్నించారు. పంచాయతీలో ఓ మల్టీ పర్పస్ వర్కర్ అతి ప్రవర్తనపై ఏంచేద్దామని వార్డు సభ్యులను అడగగా, తరువాత సమావేశంలో నిర్ణయం తీసుకుందామని కొందరు వార్డు సభ్యులు తెలిపారు.
అవకతవకలను కప్పిపుచ్చుకోవడానికే
చోరీకి తెర తీశారని ఆరోపణ


