ఖమ్మంగాంధీచౌక్: జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా ఖమ్మం ఖిలా ప్రాంతానికి చెందిన మహ్మద్ ఖాదర్ అలీ(ఖాదర్ బాబా) నియమితులయ్యారు. ఇందుకు సంబంధించి బుధవారం ప్రభుత్వ కార్యదర్శి ఏ.శ్రీదేవసేన ఉత్తర్వులు జారీ చేశారు. నామినేటెడ్ పదవుల భర్తీలో భాగంగా రాష్ట్రంలోని పలు జిల్లాల గ్రంథాలయ చైర్మన్లను నియమించారు. ఇందులో భాగంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అనుచరుడిగా సుదీర్ఘకాలం నుంచి కొనసాగుతున్న ఖాదర్ అలీకి అవకాశం దక్కింది. 1999 నుంచి తుమ్మల నాగేశ్వరరావు నాయకత్వాన టీడీపీలో ప్రస్థానం ప్రారంభించిన ఆయన 2005 నుంచి 2010 వరకు ఖమ్మం మున్సిపల్ కో–ఆప్షన్ సభ్యుడిగా పనిచేశారు. ఆ తర్వాత తుమ్మలతో పాటు టీఆర్ఎస్లో చేరి సుడా డైరెక్టర్గా పనిచేశారు. అనంతరం తుమ్మలతో పాటే కాంగ్రెస్లో చేరి పార్టీ జిల్లా కమిటీ సభ్యుడిగా, వన్టౌన్ పార్టీ కమిటీలో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈమేరకు జిల్లా కేంద్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్గా నియమితులైన ఖాదర్ అలీని పలువురు అభినందించారు.


