
జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో 14 ప్రసవాలు
ఖమ్మంవైద్యవిభాగం: జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి, కళాశాలలోని మాతా శిశు కేంద్రంలో శనివారం మధ్యాహ్నం వరకు వైద్యులు 14 ప్రసవాలు చేశారు. ఇందులో ఎనిమిది సహజ ప్రసవాలు కాగా.. ఆరు సిజేరియన్ చేశారు. వీరిలో నలుగురు మగ శిశువులు, పదిమంది ఆడశిశువులు ఉన్నారని, తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారని వైద్యులు వెల్లడించారు.
రైలు నుంచి జారిపడి
సాధువు మృతి
చింతకాని: చింతకాని రైల్వేస్టేషన్ సమీపంలో గుర్తుతెలియని రైలు నుంచి ప్రమాదవశాత్తు జారిపడి కేరళ రాష్ట్రంలోని త్రిస్సూర్కు చెందిన సాధువు శ్రీబిన్ కేఎస్ (38) మృతి చెందిన ఘటన శనివారం చోటుచేసుకుంది. రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. సాధువు వద్ద గోరఖ్పూర్ నుంచి త్రిస్సూర్కు వెళ్లే రైలు టికెట్ ఉన్నట్లు తెలిపారు. పుట్బోర్డుపై ప్రయాణిస్తూ ప్రమాదవశాత్తు జారిపడి మరణించి ఉంటాడని రైల్వే పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని అన్నం ఫౌండేషన్ చైర్మన్ అన్నం శ్రీనివాసరావు బృందం ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించింది. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గంజాయి అమ్ముతున్న
యువకుల అరెస్ట్
ఖమ్మంక్రైం: ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రి నుంచి గంజాయి తీసుకొచ్చి ఇతరులకు అమ్ముతూ, సేవిస్తున్న యువకులను వన్టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ కరుణాకర్ కథనం ప్రకారం.. నిజాంపేట ప్రాంతానికి చెందిన వినీత్, హేమంత్సాయితోపాటు మరో ఇద్దరు గంజాయి విక్రయించడంతో వారూ సేవిస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు దాడి చేసి, వారిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి 250 గ్రాముల గంజాయితోపాటు రూ.10వేలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని సీఐ వెల్లడించారు.