
మట్టిని తొలగించి స్థలం కబ్జా..!
పెనుబల్లి: ఎన్నెస్పీ కాల్వ ఆధీనంలోని మట్టిని అక్రమంగా తోలుకుపోవడంతో పాటు ఆ స్థలాలను ఆక్రమించే పనిలో పడ్డారు అక్రమార్కులు. ఇలాంటి ఘటన మండలంలోని సూరయ్యబంజర్ గ్రామంలో చోటుచేసుకుంది. సూరయ్యబంజర్ వద్ద ఎన్నెస్పీ కాల్వ తవ్వి నప్పుడు వచ్చిన మట్టిని ఆ శాఖ స్థలంలోనే కాల్వకు ఇరువైపులా పోశారు. ఆ మట్టిని ఇటీవల కాలంలో గ్రీన్ ఫీల్డ్ హైవేకి భారీ ఎత్తున తోలుకుపోయారు. దీంతో పాటు ఆ మట్టిని పరిసర ప్రాంతాల్లోని రియల్ ఎస్టేట్ వెంచర్ల యజమానులు, ఇందిరమ్మ ఇళ్లు కట్టుకుంటున్నవారు తరలించారు. దళారులు జేసీబీ సాయంతో మట్టిని తొలిగించి, ఆ స్థలాన్ని ఆక్రమించడం ప్రారంభించారు. ఇలా సూరయ్యబంజర్లో మూడు ఎకరాలకు పైగా ఉన్న మట్టిని తొలగించి, ఆ స్థలాన్ని ఆక్రమించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు సైతం చూసీచూడనట్లు వదిలేయడంతో అక్రమార్కులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా అక్రమార్కులకు కాకుండా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు కూపన్లు జారీ చేసి, ఉచితంగా మట్టి ఇచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
రామయ్యకు
సువర్ణ తులసీ అర్చన
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామివారికి శనివారం సువర్ణ తులసీ అర్చన నిర్వహించారు. స్వామివారిని బేడా మండపంలో కొలువుదీర్చి నిత్యకల్యాణం శాస్త్రోక్తంగా జరిపారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు.
శాశ్వత నిత్యాన్నదానానికి విరాళం
శాశ్వత నిత్యాన్నదాన కార్యక్రమానికి ఏపీలోని కాకినాడకు చెందిన భక్తురాలు సత్య అనురాధ రూ.లక్ష చెక్కును ఆలయ అధికారులకు అందజేశారు. దాత కుటుంబ సభ్యులతో కలిసి స్వా మివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించగా, ఆలయ అధికారులు స్వామి వారి ప్రసాదంతోపాటు జ్ఞాపికను అందజేశారు.
ఆయిల్ రికవరీని కాపాడాలి
అశ్వారావుపేట/దమ్మపేట: ఆయిల్పామ్ ఫ్యాక్టరీలో ఆయిల్ రికవరీని కాపాడాలని తెలంగాణ ఆయిల్ఫెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రశాంత్ కుమార్ సూచించారు. శనివారం అశ్వారావుపేట, దమ్మపేట మండలం అప్పారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీలను నారంవారిగూడెంలోని ఆయిల్పామ్ నర్సరీని ఆయన సందర్శించారు. ఫ్యాక్టరీలో జరుగుతున్న పనులు, గెలల క్రషింగ్ సామర్థ్యంపై అధికారులతో చర్చించారు. అనంతరం మాట్లాడుతూ ఆయిల్ రికవరీ శాతం తగ్గకుండా ఉండేందుకు గెలల దిగుమతి నుంచి క్రూడాయిల్ సేకరణ వరకు అన్ని అంశాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పక్వానికి రాని గెలలను తీసుకురావొద్దని రైతులను సూచించాలన్నారు. ప్లాంట్ల మేనేజర్లు ఎం.నాగబాబు, సత్యనారాయణ, అధికారులు పవన్, కళ్యాణ్, వెంకటేష్, కార్తీక్, రాజేష్, శివ,రాధాకృష్ణ ఉన్నారు.