
విజ్ఞాన గని..
7,855 పుస్తకాలు,
453 సభ్యత్వాలు
కారేపల్లి శాఖాగ్రంథాలయంలో 7,855 పుస్తకాలు ఉండగా, 453 మంది పాఠకులు సభ్యత్వాలు కలిగి ఉన్నారు. తెలుగు పుస్తకాలు 6,800, ఆంగ్ల పుస్తకాలు 725, హిందీ పుస్తకాలు 309 ఉండగా, పురుషులు 306, సీ్త్రలు 53, బాలురు 94 మంది సభ్యత్వాలు కలిగి ఉన్నారు. రోజువారీగా 60 – 80 మంది పాఠకులు గ్రంథాలయానికి వచ్చి చదువుకుంటారు. ఉదయం 8 నుంచి 11 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు గ్రంథాలయం తెరిచి ఉంచుతారు. ప్రతి శుక్రవారం, ప్రతినెల రెండో శనివారం సెలవు దినాలు.
కారేపల్లి: సింగరేణి (కారేపల్లి) శాఖా గ్రంథాలయం ఓ విజ్ఞాన గని. ఎందరో విద్యార్థులను ఉద్యోగులుగా, మేధావులుగా తీర్చిదిద్దిన ఓ స్థావరం. ఆనాటి యువకుల స్ఫూర్తితో.. స్వాతంత్య్రానికి ముందే 1929లో ‘భారత యువజన సంఘం’గా ఏర్పాటై, నేటి యువతకు స్ఫూర్తిదాయకమై విరాజిల్లుతోంది. భారత యువజన సంఘం స్థాపనలో ఆనాటి యువకులు పర్సా రామచంద్రరావు, నేదునూరి వీరరాఘవులు ఆధ్వర్యంలో ఈ గ్రంథాలయం ఎన్నో జ్ఞాపకాలకు వేదిక అని పలువురు చెబుతుంటారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1986 వరకు పాత భవనమే ఉన్నప్పటికీ అనంతరం కారేపల్లి శాఖా గ్రంథాలయంగా మారి.. కొత్త భవనంలో కొనసాగుతోంది.
పోటీ పరీక్షల సన్నద్ధత కోసం..
కారేపల్లి శాఖా గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ ఎఫైర్స్, కాంపిటేటివ్ బుక్స్, నవలలు, పిల్లలకు సంబంధించిన కథల పుస్తకాలు, కాకతీయులు, మొఘలులు, జైనులు, శాతావాహనుల చరిత్ర, జాతీయ నాయకుల జీవితచరిత్ర, వీటితోపాటు, ఇతిహాసాలైన రామాయణం, మహాభారతం వంటి పుస్తకాలు, ఆక్స్ఫర్డ్ డిక్షనరీ, గ్రూప్–1, గ్రూప్–2, పోలీస్, ఎంసెట్, ఎంఈడీ, టీటీసీ ప్రవేశ పరీక్షలకు సైతం ఇక్కడ పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. ఏడాది కిందటి వివిధ తెలుగు దినపత్రికలు, వార పత్రికలు, పక్ష పత్రికలు, మాస పత్రికలతో పాటు ఇంగ్లిష్, ఉర్దూ పేపర్లు అందుబాటులో ఉన్నాయి.
సింగరేణి గ్రంథాలయానికి విశేష స్పందన
స్వాతంత్య్రానికి ముందే 1929లో ఏర్పాటు
ఆనాడు భారత యువజన సంఘంగా నామకరణం
ఎందరో విద్యార్థులను తీర్చిదిద్దిన
గ్రంథాలయం

విజ్ఞాన గని..