
విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ధ్వంసం
చింతకాని: మండలంలోని వందనం, రామకృష్ణాపురం గ్రామాల సమీపంలోని వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేసి వాటిలోని రాగి వైరును అపహరించినట్లు విద్యుత్ ఏఈ చావా శ్రీధర్ స్థానిక పోలీస్స్టేషన్లో శనివారం ఫిర్యాదు చేశారు. అలాగే రేపల్లెవాడ గ్రామంలో గుర్తు తెలియని వాహనం ఢీకొనటంతో తొమ్మిది విద్యుత్ స్తంభాలు విరిగిపోయినట్లు కూడా ఫిర్యాదులో తెలిపారు. ఎస్ఐ నాగుల్మీరా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బైక్ పైనుంచి పడి గాయాలు
బోనకల్: మండలంలోని చిన్నబీరవల్లి క్రాస్రోడ్డు సమీపంలో మధిర మండలం సిద్ధినేనిగూడెం గ్రామానికి చెందిన పుట్టా రాంబాబు ద్విచక్ర వాహనం పైనుంచి ప్రమాదవశాత్తు కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడికి 108 సిబ్బంది కోటా భానుహాసన్, మిథున్చక్రవర్తి ప్రథమ చికిత్స చేసి మధిర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
హాస్టల్లో ఉండలేక
విద్యార్థిని ఆత్మహత్య
తల్లాడ: ఖమ్మంలోని ఓ ప్రైవేట్ కళాశాల హాస్టల్లో ఉండటం ఇష్టం లేక ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మండలంలోని రామానుజవరంలో శనివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఐలూరి పూజిత (16)ను తల్లిదండ్రులు ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియట్లో చేర్పించారు. విద్యార్థిని ఆదివారం పుట్టినరోజు జరుపుకుని, సోమవారం కళాశాలకు వెళ్లాల్సి ఉంది. కానీ, శుక్రవారం రాత్రి పురుగులమందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను ఖమ్మంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. పూజిత తండ్రి రామకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు తల్లాడ హెడ్ కానిస్టేబుల్ చెన్నారావు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.