
ఆదర్శం.. ఈ ఉపాధ్యాయులు
సత్తుపల్లిటౌన్/కల్లూరురూరల్/వేంసూరు: ప్రభుత్వ ఉపాధ్యాయులు వారి పిల్లల్ని ప్రైవేట్ పాఠశాలల్లో చదివిస్తూ ఇతరుల పిల్లలను ప్రభుత్వ పాఠశాల్లో చేర్పించాలని ప్రచారం చేస్తున్నారనే విమర్శలు తరచుగా వస్తుంటాయి. ఈనేపథ్యాన కొందరు ఉపాధ్యాయులు మాత్రం తమ పిల్లలను సైతం ప్రభుత్వ బడుల్లో చేర్పించి ఆదర్శంగా నిలిచారు. సత్తుపల్లి ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల ఉపాధ్యాయురాలు మారుతి అరుణకుమారి – జిట్టయ్య దంపతులు తమ పిల్లలను పాతసెంటర్ హైస్కూల్లో చేర్పించారు. వీరి పెద్దకుమారుడు ఇదే పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతుండగా, ఇప్పుడు చిన్నకొడుకు యువరామ్ తేజను ఆరో తరగతిలో చేర్పించారు. అలాగే, ఎన్టీఆర్నగర్ పాఠశాల ఉపాధ్యాయుడు కంభంపాటి వెంకటేష్ తన కుమారుడు విహాన్ను మూడో తరగతిలో చేర్పించారు. ఇక కల్లూరు మండలం పాత ఎర్రబోయినపల్లికి చెందిన మునగ దివ్య అన్నపురెడ్డిపల్లిలోని రాజాపురం ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తోంది. ఆమె భర్త బుద్ధారపు నాగేశ్వరరావు బ్యాంకు ఉద్యోగి కాగా వారి కుమారుడు మోక్షిత్ను పాత ఎర్రబోయినపల్లిలో అమ్మమ్మ, తాతయ్య వద్ద ఉంచి అదే గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో సోమవారం చేర్పించారు. మోఖిత్కు హెచ్ఎం వేదగిరి అశోక్ రెండో తరగతిలో ప్రవేశం కల్పించారు. అలాగే, వేంసూరు ప్రగతినగర్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మల్లెల్లి నాగ శ్రీనివాసరావు కుమారుడు హేమ శ్రీకార్ ప్రైవేట్ పాఠశాలలో తొమ్మిదో చదువుతుండగా సోమవారం వేంసూరు జెడ్పీహెచ్ఎస్లో చేర్పించారు. ఈ సందర్భంగా ఎంఈఓ సీహెచ్.వెంకటేశ్వరరావు, హెచ్ఎం బీ.కే.నరసింహరావు తదితరులు అభినందించారు.
ప్రభుత్వ బడుల్లో పిల్లలను
చేర్పించిన పలువురు

ఆదర్శం.. ఈ ఉపాధ్యాయులు

ఆదర్శం.. ఈ ఉపాధ్యాయులు