
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి
ఖమ్మంసహకారనగర్: ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో నర్సరీ, కేజీ తరగతులు ప్రవేశపెట్టడంతో పాటు ప్రతీ తరగతికి ఒక ఉపాధ్యాయుడిని నియమించడం ద్వారా పాఠశాలలను బలోపేతం చేయాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావా రవి కోరారు. ఖమ్మంలోని సంఘం కార్యాలయంలో శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ఇటీవల వెలువరించిన టీచర్ల సర్దుబాటు ఉత్తర్వులను సవరించాలని డిమాండ్ చేశారు. అంతేకాక అన్ని పాఠశాలలను అభివృద్ధి చేయడంతో పాటు నూతన ఆవాసాల్లో పాఠశాలలు ప్రారంభించాలన్నారు. వందలాదిగా సబ్జెక్టు టీచర్ల పోస్టులు ఖాళీగా ఉన్న నేపథ్యాన అర్హులకు పదోన్నతులు కల్పించాలని కోరారు. పాఠశాలలు ప్రారంభమయ్యేలోగా పదోన్నతులు, బదిలీలు పూర్తి చేయాలని, కాలయాపన చేయకుండా పెండింగ్ టీఏలు, పీఆర్సీ విడుదల చేయాలని రవి డిమాండ్ చేశారు. అంతేకాక పాత పింఛన్ విధానాన్ని పునరుద్ధరించాలని, నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని, కేజీబీవీ, సర్వశిక్ష ఉద్యోగ ఉపాధ్యాయులకు సరైన వేతనం చెల్లించాలని కోరారు. సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్ రంజాన్, పారుపల్లి నాగేశ్వరరావుతో పాటు బుర్రి వెంకన్న, షమీ, రాంబాబు, ఉద్దండ్ షరీఫ్, ప్రసాద్రావు, వీరస్వామి, వీరబాబు పాల్గొన్నారు.
టీఎస్ యూటీఎఫ్
రాష్ట్ర అధ్యక్షుడు చావా రవి