
డెయిరీ ఫలాలతో ఆర్థికాభివృద్ధి
మధిర: ఇందిరా మహిళా డెయిరీ ద్వారా అందే యూనిట్లను సద్వినియోగం చేసుకుంటూ మహిళా లబ్ధిదారులు ఆర్థికాభివృద్ధి సాధించాలని డీఆర్డీఓ సన్యాసయ్య సూచించారు. త్వరలో డెయిరీ ఏర్పా టు కానున్న నేపథ్యాన మధిరలోని కార్యాలయంలో శనివారం మహాజనసభ నిర్వహించగా డీఆర్డీఓ మాట్లాడారు. మహిళల ఆర్థికాభివృద్ధి కోసం డిప్యూ టీ సీఎం భట్టి విక్రమార్క చొరవతో డెయిరీ ఏర్పాటవుతోందని తెలిపారు. సభ్యత్వం కలిగిన వారికి సబ్సిడీపై రెండు చొప్పున పాడి గేదెలు ఇవ్వనుండగా, ఇప్పటి నుంచే దాణా సేకరణ, గడ్డి పెంపకంపై దృష్టి సారించాలని చెప్పారు. అనంతరం డెయిరీలో నిబంధనల సవరణ, నూతనంగా పలువురికి సభ్యత్వం కల్పించడం, ఎర్రుపాలెం మినహా మిగిలిన నాలుగు మండలాల్లో పాలశీతలీకరణ కేంద్రాల ఏర్పాటు, నూతన పాలకవర్గం ఎన్నిక ప్రతిపాదనలపై చర్చించారు. సమావేశంలో ఏపీఎం జంగం లక్ష్మణ్రావుతో పాటు మామిళ్ల శ్రీనివాసరావు, కోటేశ్వర్రెడ్డి, మురళీకృష్ణ, అన్నపూర్ణ, లలిత కుమారి తదితరులు పాల్గొన్నారు.