
ఉత్సాహంగా క్రీడా శిక్షణ
● జిల్లా కేంద్రంలో 21 అంశాల్లో శిబిరాల నిర్వహణ ● నేటితో ముగియనున్న వేసవి శిక్షణ
ఖమ్మం స్పోర్ట్స్: జిల్లాలోని వివిధ ప్రాంతాలతో పాటు జిల్లా కేంద్రంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యాన నెల రోజులుగా జరుగుతున్న వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు శనివారం ముగియనున్నాయి. విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించగానే విద్యార్థులకు శిక్షణ ఇచ్చేలా ఈ శిబిరాలు ఏర్పాటుచేశారు. దీంతో పెద్దసంఖ్యలో ఔత్సాహిక క్రీడాకారులతో స్టేడియం ఇన్నాళ్లు కళకళలాడింది. స్టేడియంలో 21 క్రీడాంశాల్లో ఇచ్చిన శిక్షణకు పెద్దసంఖ్యలో బాలబాలికలు హాజరయ్యారు. అథ్లెటిక్స్, ఆర్చరీ, ఫుట్బాల్, వాలీబాల్, బ్యాడ్మింటన్, స్విమ్మింగ్, లాన్ టెన్నిస్, ఖో–ఖో, నెట్బాల్, వెయిట్ లిఫ్టింగ్, బ్యాడ్మింటన్, రోలర్ స్కేటింగ్, బాస్కెట్బాల్, హ్యాండ్బాల్, క్రికెట్, ఉషూ, కరాటేలో శిక్షన్న తీసుకున్న పలువురు సెలవులు ముగిశాక కూడా శిక్షణ కొనసాగిస్తామని చెబుతుండడం విశేషం. కాగా, పెవిలియన్గ్రౌండ్, సెయింట్ జోసెఫ్ హైస్కూల్ మైదానాల్లో కొన్ని అంశాల్లో శిక్షణ ఇచ్చారు. శిబిరాల్లో 1,672 మంది ఔత్సాహికులు పాల్గొనగా వర్ధమాన క్రీడాకారులు మరో 300 మంది ఉంటారని అధికారులు తెలిపారు.
ఎక్కువగా బాలురే...
వివిధ క్రీడల్లో ఏర్పాటుచేసిన వేసవి క్రీడా శిక్షణ శిబిరాలకు బాలికలతో పోలిస్తే బాలురే ఎక్కువగా వచ్చారు. మొత్తంగా బాలురు 1,216 మంది హాజరు కాగా, బాలికలు 456 మంది పాల్గొన్నారు. అత్యధికంగా స్విమ్మింగ్ శిక్షణకు 580 మంది హాజరయ్యారు. అలాగే, రోలర్స్కేటింగ్కు 177 మంది బాలబాలికలు, బాస్కెట్బాల్కు 104 మంది, క్రికెట్ 100మంది, అథ్లెటిక్స్కు 85మంది, వాలీ బాల్కు 80 మంది, బ్యాడ్మింటన్కు 80 మంది, టెన్నిస్కు 79 మంది హాజరు కాగా మిగిలిన క్రీడాంశాల్లో 40మందికి తగ్గకుండా పాల్గొన్నారు. గతంతో పోలిస్తే ఈసారి గణనీయంగా క్రీడాకారులు రావడంతో కోచ్లు ఉత్సాహంగా శిక్షణ ఇచ్చారు.
మంచి స్పందన వచ్చింది...
జిల్లా కేంద్రంలో వేసవి క్రీడా శిక్షణ శిబిరాలకు అనూహ్యమైన స్పందన లభించింది. అనుకున్న దాని కంటే ఎక్కువ మంది హాజరయ్యారు. వీరిలో కొందరైనా నిత్యం శిక్షణ కొనసాగిస్తే మెరుగైన క్రీడాకారులు వెలుగులోకి రాడం ఖాయం. ఈ విషయమై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాం.
– టి.సునీల్రెడ్డి, డీవైఎస్ఓ

ఉత్సాహంగా క్రీడా శిక్షణ