
బహుదూరపు బాటసారులకు నీడ!
మధిర: పూర్వకాలంలో రాకపోకలకు నడక మార్గం లేదా ఎడ్లబండ్లనే ఉపయోగించేవారు. దీంతో రాత్రివేళల్లోనే కాకుండా మార్గమధ్యలో విశ్రాంతికి ఆగ డం, అక్కడే భోజనం వండుకుని తిన్నాక ముందు కు సాగేవారు. ఇలాంటివారి కోసం వివిధ ప్రాంతా ల్లో సత్రాలు ఉండేవి. కొన్నిచోట్ల భోజనానికి సైతం దాతలు ఏర్పాట్లు చేసేవారు. అలా మధిర మండలం దెందుకూరులోనూ సత్రం నిర్మించగా వేలాది మందికి ఆశ్రయం కల్పించేవారని చెబు తారు. గ్రామానికి చెందిన కపిలవాయి సీతమ్మ నేతృత్వాన సత్రం కోసం పెంకుటిళ్లు నిర్మించగా.. శిథిలావస్థకు చేరడంతో ఆమె కుటుంబానికి చెందిన సుబ్బలక్ష్మి ఆధ్వర్యాన కొన్నేళ్ల క్రితం పునర్నిర్మించారు.
రావిచెట్టు సెంటర్..
దెందుకూరులోని రావిచెట్టు సెంటర్లో బాటసారుల సత్రం ఉంటుంది. వందేళ్ల క్రితమే కపిలవాయి సీతమ్మ పూర్వీకులు సత్రంగా పెంకుటిల్లు నిర్మించారని చెబుతారు. అయితే, అది శిథిలావస్థకు చేరడంతో సీతమ్మ వారసులు సుబ్బలక్ష్మి తదితరులు మూడేళ్ల క్రితం అక్కడే నూతన భవనం నిర్మించి కపిలవాయి సీతమ్మ సత్రంగా నామకరణం చేశారు. సత్రం నిర్వహణ కోసం రెండు దుకాణాలను నిర్మించి అద్దెకు ఇచ్చారు. ఈ సత్రం గతంలో కళావేదికగానూ విలసిల్లింది. సాంఘిక, పౌరాణిక, చారిత్రాత్మక నాటక ప్రదర్శనలు, కళారూపాల ప్రదర్శన ఈ సత్రం వేదికగా ఇచ్చేవారట. ఇక్కడి రావిచెట్టు 150 ఏళ్ల నాటిదని పూర్వీకులు చెప్పేవారని గ్రామ పెద్దలు చెబుతున్నారు. కాగా, 1969లో తుఫాన్ వచ్చిన సందర్భంగా దెందుకూరు సమీపంలో మద్రాస్ ఎక్స్ప్రెస్ రైలు మూడు రోజులు నిలిస్తే ప్రయాణికులను దెందుకూరులోని ప్రతీ ఇంట ఆదరించారని చెబుతారు. అప్పటికే రావి చెట్టు పక్కన కపిలవాయి సీతమ్మ నిర్మించిన సత్రం ఎందరికో నిలువ నీడను ఇచ్చిందట. అలాగే, నడక మార్గంలో వెళ్లే ప్రయాణికులు, ఎడ్ల బండ్లపై వచ్చివెళ్లే చిరు వ్యాపారులు, సన్నకారు రైతులు ఆశ్రయం తీసుకునేవారని గ్రామంలో చెప్పుకుంటారు.
రామాలయ నిర్మాణం
తొలినాళ్లలో సత్రం నిర్మిస్తుండగా చేపట్టిన తవ్వకాల్లో శ్రీసీతారాముల విగ్రహాలు బయటపడ్డాయని చెబుతారు. ఈ విగ్రహాలను సత్రానికి సమీపంలో ప్రతిష్ఠించి ఆలయ నిర్మాణం చేపట్టారు. ఆలయ నిర్వహణ కోసం కపిలవాయి సీతమ్మ 6.50 ఎకరాల భూమి, ఆంజనేయస్వామి ఆలయానికి 2.50 ఎకరాలు విరాళంగా ఇచ్చారు. శ్రీ కోదండ రామస్వామి ఆలయానికి కుందా వెంకటేశ్వర్లు 4.07 ఎకరాలు భూదానం చేశారు. తద్వారా వచ్చే ఆదాయం ఆలయ నిర్వహణ సాఫీగా సాగుతోంది.
పూర్వకాలం నుంచి రాకపోకలు సాగించే ఎందరికో ఆశ్రయం
దెందుకూరులో సత్రం..
ఇటీవల పునర్నిర్మాణం
కళాకారుల ప్రదర్శనలకు
వేదిక కూడా...

బహుదూరపు బాటసారులకు నీడ!