
నిర్ణీత సమయంలో అభివృద్ధి పనులు
● రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ● మున్నేటి రిటైనింగ్ వాల్ సహా పలు పనులపై సమీక్ష
ఖమ్మంసహకారనగర్: జిల్లా కేంద్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులను నిర్ణీత సమయంలో పూర్తి చేసేలా అవసరమైన భూసేకరణపై అధికారులు దృష్టి సారించాలని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. కలెక్టరేట్లో ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి, కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్తో కలిసి శనివారం ఆయన ధాన్యం కొనుగోళ్లు, మున్నేటికి ఇరువైపులా రిటైనింగ్ వాల్ నిర్మాణం, జాతీయ రహదారుల పురోగతి, వెలుగుమట్ల అర్బన్ పార్క్, పర్యాటక ప్రాంతాల అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ఏడాది భారీ వరదలు వచ్చిన నేపథ్యాన నిపుణుల కమిటీ సూచనలతో రిటైనింగ్ వాల్ డిజైన్లో మార్పులు చేశామని.. ఇందుకు అనుగుణంగా నాణ్యతతో సకాలంలో పూర్తయ్యేలా చూడాలని ఆదేశించారు. 3.50 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా తట్టుకునేలా 8.5 కిలోమీటర్ల మేర రెండు వైపులా రిటైనింగ్ వాల్ పూర్తి చేయాలన్నారు. అక్కడి నిర్వాసితులకు ఎన్నెస్పీ భూములను అభివృద్ధి చేసి ఇస్తామని చర్చలు జరపాలని తెలిపారు. అలాగే, సాగర్లో తెగిపోయిన యూటీ పునర్నిర్మించాలని, మంచుకొండ ఎత్తిపోతల పథకం వద్ద హెడ్ రెగ్యులేటర్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని చెప్పారు. అలాగే, ఖమ్మంలో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, ఆక్రమణల తొలగింపు, ఎస్టీపీల నిర్మాణంపై మంత్రి సూచనలు చేశారు. కాగా, కొనుగోలు కేంద్రాల నుంచి ఎప్పటికప్పుడు మిల్లులకు ధాన్యం తరలించాలని మంత్రి సూచించారు. లారీల కొరతతో ధాన్యం పేరుకుపోయి అకాల వర్షాలతో రైతులకు నష్టం జరుగుతున్నందున తరలింపులో వేగం పెంచాలన్నారు. అలాగే, జిల్లాలో మెడికల్ కాలేజీ నిర్మాణాలు, ప్రధాన ఆస్పత్రికి ప్రతిపాదనలపై సమీక్షించారు.
లక్ష్యం మేర పనులు జరగాలి
ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి మాట్లాడుతూ రిటైనింగ్ వాల్ నిర్మాణంల రోజువారీ లక్ష్యాన్ని ఎంచుకుంటే ఫలితాలు వస్తాయని తెలిపారు. కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ రిటైనింగ్ వాల్ నిర్మాణానికి అవసరమైన పట్టా భూముల సేకరణకు రైతులతో చర్చిస్తున్నామని చెప్పారు. అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ మాట్లాడుతూ రూ.29 కోట్లతో ఖమ్మం ఖిలాపైకి రోప్ వే ప్రతిపాదించగా, కేఎంసీ నుంచి రూ.3 కోట్ల నిధులు వచ్చాయని తెలిపారు. అలాగే, మట్టి నమూనా పరీక్షలు చేయించామని చెప్పారు. డీఎఫ్ఓ సిద్ధార్థ్ విక్రమ్సింగ్ మాట్లాడుతూ వెలుగుమట్ల అర్బన్ పార్క్లో రూ.3 కోట్ల తో బటర్ ఫ్లై పార్క్, చిల్డ్రన్స్ పార్క్, ఫౌంటెన్లు,, బోటింగ్ పనులు ఈ నెలాఖరుకు పూర్తవుతాయని తెలిపారు. హరిత నిధి ద్వారా వచ్చిన రూ.1.28 కోట్లతో 110 హెక్టార్ల మేర ఫెన్సింగ్ వేస్తున్నామన్నారు. ఇంకా ఈ సమావేశంలో ఇరిగేషన్, మునిసిపల్, టూరిజం, వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు, సివిల్ సప్లయీస్ అధికారులు పాల్గొన్నారు.