
విద్యుత్ శాఖ పొలంబాట
ఖమ్మంవ్యవసాయం/ముదిగొండ : రైతులకు మరింతగా చేరువయ్యేందుకు టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ ఆదేశాల మేరకు ‘విద్యుత్ శాఖ పొలంబాట’ కార్యక్రమాన్ని జిల్లాలో ఆదివారం ప్రారంభించారు. విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర నియోజకవర్గంలోని ముదిగొండ మండలం లక్ష్మీపురంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పొలంబాటలో భాగంగా ఒరిగిన స్తంభాలను సరిచేయడం, విరిగిన, ప్రమాదకరంగా ఉన్న స్తంభాలను మార్చటం, కిందకు వేలాడుతున్న విద్యుత్ వైర్లను సరిచేయడం వంటి పనులు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యుత్ సర్కిల్ ఎస్ఈ ఎ.సురేందర్ మాట్లాడుతూ.. రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించడం, విద్యుత్ భద్రత సూత్రాలు, విద్యుత్ పొదుపు వంటి అంశాలపై అవగాహన పెంచేందుకే ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. రైతులు విద్యుత్ మోటార్ల వద్ద తగిన కెపాసిటర్లను వినియోగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టెక్నికల్ డీఈ బాబూరావు, ముదిగొండ ఏడీఈ బీంసింగ్, ఏఈ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
లక్ష్మీపురం నుంచి శ్రీకారం చుట్టిన అధికారులు