
పాల సంఘం.. ఎన్నికలు ఘనం
కోలారు: కోలారు జిల్లా పాల ఉత్పత్తిదారుల సహకార సంఘానికి (కోముల్) రానున్న 3 రోజుల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి నానా విన్యాసాలు చేస్తున్నారు. పలువురు అభ్యర్థులు ఓటర్లకు గోవా, కేరళ ట్రిస్పులకు పంపి ఓట్లు కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ – ఎన్డిఎ కూటమి అభ్యర్థులు తమ పార్టీ నాయకుల సహకారంతో ఓటర్లను గోవా, కేరళ, ఊటీ, అండమాన్ తదితర ప్రాంతాలకు టూర్లకు పంపుతున్నారు. కొంతమంది స్వతంత్ర అభ్యర్థులకు కూడా టూర్ల భాగ్యం కలుగుతోంది. దీనికి తోడు ఓటర్లకు డబ్బులు, కానుకలతో ప్రలోభ పెడుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇక్కడ తీవ్ర పోటీ
ప్రముఖంగా ముళబాగిలు పూర్వ, పశ్చిమ క్షేత్రాలలో తీవ్ర పోటీ ఉంది. మాలూరు క్షేత్రానికి చెందిన ఓటర్లను గోవా పర్యటనకు తీసుకు వెళ్లినట్లు తెలిసింది. శ్రీనివాసపుర, అడ్డగల్, యల్దూరు, బంగారుపేట, కేజీఎఫ్ క్షేత్రాలలోను తీవ్ర పోటీ ఉంది. తాము పర్యటనకు పంపిన ఓటర్లతో ప్రత్యర్థులు ఫోన్లో మంతనాలు చేస్తారనే భయంతో వారి మొబైళ్లను స్విచాఫ్ చేయించారు. కుటుంబంతో మాట్లాడాల్సి వస్తే అభ్యర్థి తరపు మొబైల్ ఫోన్ నుంచే మాట్లాడాల్సి వస్తోంది. పోలింగ్కు ముందు రోజున పొరుగు జిల్లాలోని రిసార్టులలో ఉంచి ఎన్నికల రోజున నేరుగా పోలింగ్ కేంద్రాలకు తీసుకువస్తారు.
కళ్లుచెదిరే నజరానాలు
ఒక్కో ఓటరుకు అభ్యర్థి రూ.లక్ష నుంచి 3 లక్షల వరకు డబ్బులు ఎర వేసినట్లు సమాచారం అందుతోంది. మొత్తం 986 పాల సంఘాలలో 937 మంది అర్హత కలిగిన ఓటర్లు, 49 మంది అనర్హ ఓటర్లు ఉన్నారు. మొత్తానికి కోముల్ ఎన్నికలు ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలను తలపిస్తున్నాయనడంలో సందేహం లేదు. కోముల్లో ఇబ్బడిముబ్బడిగా ఆదాయం రావడమే తీవ్ర పోటీకి ఉసిగొల్పింది.
ఓటర్లకు విమానాలలో టూర్ల సదుపాయం
ఓటరుకు రూ. లక్షకు పైగా నగదు
పలువురికి ఖరీదైన విహారాలు
12 డైరెక్టర్ స్థానాలకు పోటాపోటీ
కోముల్ ఎన్నికల హడావుడి
12 స్థానాలకు 29 మంది పోటీ
ఈ నెల 25వ తేదీన కోలారు ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల మైదానంలో ఎన్నికలు జరుగుతాయి.
12 మంది డైరెక్టర్ల స్థానాలకు 29 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మరో డైరెక్టర్ స్థానానికి టీకల్ క్షేత్రం నుంచి ఎమ్మెల్యే కె వై నంజేగౌడ ఇప్పటికే ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు.
మొత్తం 900 కు పైగా ఓటర్లు ఉన్నారు. ఒక్కో డైరెక్టర్ పరిధిలో 55 నుంచి 99 వరకు ఓట్లు ఉన్నాయి.
పాల సహకార సంఘాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులే ఇందులో ఓటర్లుగా ఉన్నారు.
ఓటర్లు కొంతమంది కాంగ్రెస్ వైపున, మరికొంతమంది ఎన్డిఎ కూటమి వైపున ఉన్నారు. ఓటర్లను ఆకర్షించి గెలవాలని అభ్యర్థులు, పార్టీలు చేయని ప్రయత్నమంటూ లేదని తెలుస్తోంది.
ఒక్కో ఓటరుకు రూ. లక్ష నుంచి రూ.3 లక్షల వరకూ నగదు, ఇతరత్రా ఖరీదైన కానుకలు, పైగా దేశంలో పర్యాటక ప్రాంతాలకు విమానంలో టూర్ సదుపాయం. ఇదీ కోముల్ ఎన్నికల తీరు. పాల సహకార సంస్థలో ఇంత హడావుడి ఎందుకో అని ఎవరికై నా అనుమానం రావచ్చు. అక్కడి ఆదాయమే దీనికి కారణం.

పాల సంఘం.. ఎన్నికలు ఘనం

పాల సంఘం.. ఎన్నికలు ఘనం

పాల సంఘం.. ఎన్నికలు ఘనం