
ప్రతి శాఖలోనూ రేటు ఫిక్స్
మండ్య: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మాట్లాడాల్సిన పని లేదు. వచ్చే ఎన్నికల వరకు చూస్తాము, ఈ సర్కారు గురించి ఏమీ ఆలోచించం అని కేంద్ర మంత్రి హెచ్.డి.కుమారస్వామి అన్నారు. ఆదివారం మండ్యలో ఆటోస్టాండు నిర్మాణం సహా పలు కార్యక్రమాల్లో పాల్గొని మీడియాతో మాట్లాడారు. విధానసౌధలో ఇప్పుడు మధ్యవర్తుల అవసరం ఎంతమాత్రం లేదు. మంత్రులు అన్ని రకాల పనులకు సిద్ధమయ్యారు. రేటు కూడా ఫిక్స్ చేసుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే బీ.ఆర్. పాటిల్ చేసిన ఆరోపణల్లో ఎలాంటి అబద్ధం లేదని, ఎమ్మెల్యే సొంతపార్టీ మంత్రిపై ఆరోపణలు చేశాడంటే ఎన్ని ఇబ్బందులపాలు చేసి ఉంటారో అని అన్నారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం మంత్రి వద్దకు వెళ్తే, ఆయన రేటు మాట్లాడితే ఏం చేయాలని విమర్శించారు. అన్ని శాఖల్లోనూ ఇలాగే ఉందన్నారు. యువతకు ఉద్యోగాలు కల్పించాలి అనే తన కలకు ఈ ప్రభుత్వంలో ఎలాంటి ఇబ్బందులు వస్తున్నాయో అందరికీ తెలుసని కుమార అన్నారు. అయినా నా ప్రయత్నం ఆగదని చెప్పారు.
రాష్ట్ర సర్కారుపై కుమార హేళన