లేకలేక కొడుకు జన్మిస్తే.. | - | Sakshi
Sakshi News home page

లేకలేక కొడుకు జన్మిస్తే..

Jun 23 2025 5:54 AM | Updated on Jun 23 2025 5:54 AM

లేకలే

లేకలేక కొడుకు జన్మిస్తే..

యశవంతపుర: విశ్రాంత నర్సు నిర్లక్ష్యంగా కాన్పు చేయడంతో తల్లీ, శిశువు పురిట్లోనే కన్నుమూశారు, ఈ విషాద సంఘటన కలబురగి జిల్లా చిత్తాపుర తాలూకా వాడి పట్టణంలో ఆదివారం జరిగింది. ఇంగళగి గ్రామానికి చెందిన శ్రీదేవి ప్రభానూరు (28), నవజాత మగశిశువు మరణించారు. శ్రీదేవి ప్రసవం కోసం రిటైర్డ్‌ నర్సు గంగుబాయి వద్ద చేరింది. ఆమెకు ఇదివరకే ముగ్గురు ఆడపిల్లలు ఉండగా, ఈసారి కొడుకు జన్మించాడు. కానీ అతడు ప్రాణాలతో లేడని, కొంతసేపటికే ఆరోగ్యం విషమించి తల్లి కూడా మరణించిందని బంధువులు విలపించారు. నర్సుపై చర్యలు తీసుకోవాలని బంధువులు వాడి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కాలేజీ ఫీజు దొంగలపాలు

శివాజీనగర: పిల్లల కాలేజీ ఫీజు చెల్లించేందుకు దాచిపెట్టిన డబ్బును దొంగలు దోచుకొని పరారైన ఘటన బెంగళూరులోని ప్యాలెస్‌ ఆవరణలోని ఓ ఇంట్లో జరిగింది. శ్రీనివాస్‌ అనే వ్యక్తి పిల్లల కాలేజీల ఫీజులు కట్టాలని కొంత సొమ్మును అప్పు చేసి తీసుకొచ్చారు. శనివారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలు ఇంటి తలుపులను బద్ధలు కొట్టి చొరబడ్డారు. 2 బీరువాలను పగలగొట్టి, అందులో ఉన్న బంగారు ఆభరణాలు, నగదును ఎత్తుకెళ్లారు. ఆదివారం చోరీ సంగతి తెలిసి బాధితుడు సదాశివనగర పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇంటి దగ్గరలో చేపలు పట్టేందుకు వచ్చేవారు దొంగతనం చేసి ఉండవచ్చని తెలిపారు.

భర్తే హంతకుడు!

భార్య, కూతురు హత్య

యశవంతపుర: పొలంలోని నీటికుంటలో తల్లీ కూతురు మృతదేహాలు బయటపడ్డాయి. బెంగళూరు గ్రామాంతర జిల్లా దేవనహళ్లి తాలూకా ఇండ్రసనహళ్లిలో చోటు చేసుకొంది. స్థానికులు మాల (28), ఆమె కుమార్తె అనుశ్రీ (8) శవాలు అనుమానస్పదంగా బయట పడ్డాయి. అస్తి వివాదంలో భర్తే ఇద్దరినీ హత్య చేసి నీటికుంటలో పడేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మాల ఆస్తిలో భాగం అడిగినందుకు ఈ పనికి పాల్పడినట్లు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. గుంతలో నుంచి మృతదేహాలను బయటకు తీశారు. దేవనహళ్లి ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టుం నిర్వహించారు. మృతురాలి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. నిందితున్ని అరెస్టు చేశారు.

11 రోజుల మైసూరు ఉత్సవాలు కొత్త కాదు

మైసూరు: ప్రపంచ ప్రసిద్ధ నాడహబ్బ మైసూరు దసరా మహోత్సవాలను ఈ ఏడాది 10 రోజులకు బదులుగా 11 రోజులు నిర్వహించాలని నిర్ణయించడంపై రాజవంశీకురాలు ప్రమోదాదేవి ఒడెయార్‌ స్పందించారు. ఇదేమీ కొత్త విషయం కాదన్నారు. గతంలోను 11 రోజులపాటు మైసూరు దసరా వేడుకలు జరిగాయని ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా చారిత్రక ఘటనలను ప్రస్తావించారు. 1920, 1929, 1953, 1963, 1980, 1990, 1998, 2000, 2015, 2016వ సంవత్సరాల్లో 11 రోజుల పాటు ఉత్సవాలు జరిగాయని, చాంద్రమాన క్యాలెండర్‌ పంచాంగాన్ని మైసూరు ప్యాలెస్‌ పాటిస్తుందని చెప్పారు. దసరా సంబరాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు.

లేకలేక కొడుకు జన్మిస్తే..   1
1/1

లేకలేక కొడుకు జన్మిస్తే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement