నిర్మాణంలో ఉండగానే కూలింది | - | Sakshi
Sakshi News home page

నిర్మాణంలో ఉండగానే కూలింది

Jun 3 2025 12:21 AM | Updated on Jun 3 2025 12:21 AM

నిర్మ

నిర్మాణంలో ఉండగానే కూలింది

కూలీ మృతి, నలుగురికి గాయాలు

మండ్య: నిర్మాణ దశలో ఉన్న మహాద్వారం కుప్పకూలిన ప్రమాదంలో ఒక కార్మికుడు మరణించగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన మండ్య జిల్లాలోని నాగమంగళ తాలూకాలోని దేవరహళ్ళి గ్రామంలో జరిగింది. వివరాలు.. తపసీరాయ స్వామి దేవాలయం ముందు భాగంలో మహాద్వారాన్ని నిర్మిస్తున్నారు. సుమారు 20 అడుగుల ఎత్తు, 35 అడుగుల పొడవునా నిర్మాణమవుతోంది. పై భాగంలో కాంక్రీట్‌ వేయడం కోసం కడ్డీలతో చట్రం బిగించారు. సోమవారం మధ్యాహ్నం కాంక్రీటు వేస్తుండగా బరువు తట్టుకోలేక చట్రం కుప్పకూలి కార్మికుల మీద పడింది. ఐదుమంది కార్మికులు చిక్కుకున్నారు. జేసీబీని తీసుకొని వచ్చి శిథిలాలను తొలగించి కూలీలను బయటకు తీవారు. ఆస్పత్రికి తరలిస్తున్నప్పుడు కల్బుర్గి జిల్లాకు చెందిన శరన్‌ (27) అనే కూలి చనిపోయాడు. మిగతావారికి ఆస్పత్రిలో చికిత్స జరుగుతోంది. నాగమంగళ పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు. నాసిరకంగా సెంట్రింగ్‌ను వేయడమే కూలడానికి కారణమని అనుమానాలున్నాయి.

పెళ్లిలో రూ.25 లక్షల నగల చోరీ

దొడ్డబళ్లాపురం: కళ్యాణ మండపంలో వధువుకు చెందిన రూ.25 లక్షల విలువైన బంగారు నగలు చోరీకి గురైన సంఘటన బెంగళూరు రాజాజినగర పరిధిలో చోటుచేసుకుంది. గవిపురం నివాసి ఎల్‌.శివశంకర్‌ ఈమేరకు మాగడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. శివశంకర్‌ కుమార్తె దివ్య వివాహం రాజాజినగర సప్తపది కళ్యాణ మండపంలో జరిగింది. మే 29న జరిగిన రిసెప్షన్‌కు అనేకమంది అతిథులు హాజరయ్యారు. పెళ్లికూతురికి చెందిన ఖరీదైన కానుకలు, రూ.25 లక్షల విలువైన నగలను సూట్‌కేస్‌, బ్యాగుల్లో భద్రపరిచి నిద్రపోయారు. మే 30న ఉదయం అందరూ లేచి గదికి తాళంవేసి ముహూర్తానికి వెళ్లారు. ఇంతలో ఎవరో దొంగలు నకిలీ తాళంచెవితో గది తాళం తీసి నగల బ్యాగులను అపహరించారు. చోరీ వల్ల పెళ్లిలో ఉత్సాహం బదులు విచారం తాండవించింది.

కొట్లాడుతూ ఉంటే హిందీని రుద్దుతారు

దొడ్డబళ్లాపురం: కన్నడ, తమిళం అంటూ మనం కొట్లాడుతూ సమయం వృథా చేస్తే కేంద్రం వచ్చి మనపై హిందీ భాషను రుద్దుతుందని మంత్రి కృష్ణభైరేగౌడ అన్నారు. తాజా కన్నడ, తమిళ వివాదాన్ని ప్రస్తావించారు. సోమవారంనాడు కెంపేగౌడ విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడిన ఆయన అన్ని భాషలూ సమానమే అన్నారు. అయితే బలవంతంగా మనపై హిందీ రుద్దాలని చూస్తున్నారని ఇదే అసలు సమస్య అన్నారు. స్వయంప్రేరితంగా హిందీ నేర్చుకొంటే తప్పులేదని, నేర్చుకో అని ఒత్తిడి చేయడం సబబు కాదన్నారు.

ఫొటోషూట్‌కు

రూ.25 వేల జరిమానా

జంటకు అటవీశాఖ వడ్డన

మైసూరు: ఇది ఫోటోషూట్ల కాలమైంది. పెళ్లికి ముందు, ఆ తరువాత, తల్లీ తండ్రి కాబోతుంటే మరోసారి ఇలా అనేక సందర్భాలలో ఫోటోషూట్లు ఉండాల్సిందే. కొన్నిసార్లు ఇవి వెర్రిగా మారుతుంటాయి కూడా. ఇదే మాదిరిగా మైసూరులోని చామరాజనగర జిల్లా గుండ్లుపేట తాలూకాలోని బండీపుర వన్యప్రాణుల అభయారణ్యంలోకి చొరబడి ఫోటోలు తీసుకున్న జంటకు అటవీశాఖ రూ. 25 వేల జరిమానా వడ్డించింది. బెంగళూరుకు చెందిన పల్లవి, ఘోష్‌ అనే వ్యక్తులు విహారానికి వచ్చారు. బండీపుర మంగళ రోడ్డు సమీపంలో అడవిలోకి వెళ్లి ఫోటో షూట్‌ చేస్తున్నారు. ఇక్కడ ఫోటోలు తీయడం నిషిద్ధం. అటవీ అధికారి నవీన్‌కుమార్‌కు పర్యాటకులకు సమాచారం అందించారు. వెంటనే ఆ జంటను పట్టుకుని హెచ్చరిక లేఖ ఇచ్చి రూ. 25 వేలు జరిమానా విధించారు.

నిర్మాణంలో ఉండగానే కూలింది 1
1/1

నిర్మాణంలో ఉండగానే కూలింది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement