
ఆల్మట్టి ఎత్తు పెంపునకు అడ్డంకులా?
బనశంకరి: కృష్ణా ట్రైబ్యునల్ తీర్పు ప్రకారం కర్ణాటక రాష్ట్రం వాటా నీటిని ఉపయోగించుకోవడానికి ఆల్మట్టి డ్యామ్ ఎత్తును 524 మీటర్లకు పెంచాలని ట్రైబ్యునల్లో కోరినప్పుడు మౌనంగా ఉన్న మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ హఠాత్తుగా అభ్యంతరం చెప్పడం ఆశ్చర్యం కలిగించిందని డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్ అన్నారు. సోమవారం విధానసౌధలో విలేకరులతో మాట్లాడుతూ ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచి రాష్ట్ర రైతులు హితరక్షణ కాపాడటానికి రాష్ట్ర ఎంపీలు, కేంద్రమంత్రులు సహకరించాలని చేతులెత్తి మొక్కుతానని అన్నారు. గత నెల 9వ తేదీన దేవేంద్ర ఫడ్నవీస్, సీఎం సిద్దరామయ్యకు లేఖ రాశారని తెలిపారు. ఆలమట్టి ఎత్తు పెంచితే మహారాష్ట్రలో సాంగ్లి, కొల్హాపుర జిల్లాలు వరద ముంపు సమస్యను ఎదుర్కొంటాయని లేఖలో రాశారన్నారు. ఫడ్నవీస్ వైఖరి తమకు తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. 2010 ట్రైబ్యునల్ తీర్పు పట్ల మహారాష్ట్ర ఎప్పుడూ ప్రశ్నించలేదని, ఈ పథకాన్ని అమలు చేయాలని మహారాష్ట్ర కూడా చెప్పిందని, కానీ ఇప్పుడు మళ్లీ డ్యాం ఎత్తు పెంచరాదని లేఖ రాసిందని డీకేశి ఆరోపించారు. ఎత్తు పెంపు అనేది ట్రైబ్యునల్లో తమకు దక్కిన హక్కు అని, దీనిపై సీఎం సిద్దరామయ్య ఒకటి రెండు రోజుల్లో తిరుగు లేఖ రాస్తారని తెలిపారు.
వరద వారి సమస్య
మహారాష్ట్రలో వరదలు తలెత్తితే, అది వారి సమస్య. వారే సరిదిద్దుకోవాలని కేంద్రమంత్రులను, ప్రధానిని కలిసి చెబుతామని డీకే అన్నారు. ఇందులో రాష్ట్ర ఎంపీలు, కేంద్రమంత్రులు సమైక్యంగా ఉండాలన్నారు. 2013 నుంచి ఈ పథకానికి గెజిట్ నోటిఫికేషన్ కావాలని వేచి చూస్తున్నామని, ఇంకా ఎన్నిరోజులు నిరీక్షించాలని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి సోమణ్ణ ఆల్మట్టి గురించి స్పందిస్తూ ఈ ప్రాజెక్టు రాష్ట్ర హితమని, మాకు వేరే రాష్ట్రాలతో గొడవ ఇష్టంలేదని, మన వాటా నీరు కావాలని అన్నారు. ఆలస్యం కావడం వల్ల ఖర్చు పెరిగిపోతోంది. భూస్వాధీనానికి లక్ష కోట్ల రూపాయలు అవసరమని అన్నారు.
మహారాష్ట్ర సీఎం లేఖపై
డిప్యూటీ సీఎం ధ్వజం