
మొబైల్ జామర్తో ప్రజలకు పాట్లు
బళ్లారి అర్బన్: నగరంలోని కనకదుర్గమ్మ గుడి సమీపంలో ఉన్న సెంట్రల్ జైల్లో ఇటీవల కొత్తగా మొబైల్ జామర్ను ఏర్పాటు చేయడంతో జైల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో మొబైల్ నెట్వర్క్ సమస్యతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, జామర్ సామర్థ్యాన్ని వెంటనే తగ్గించాలని మాజీ ఎమ్మెల్యే సోమశేఖర్రెడ్డి పోలీస్ సూపరింటెండెంట్కు విన్నవించారు. ఆదివారం బీజేపీ ఆధ్వర్యంలో జైల్ సూపరింటెండెంట్కు ఆయన వినతిపత్రాన్ని అందించారు. జామర్ ఏర్పాటుతో సమీపంలోని వ్యాపార దుకాణాలు, ఫోన్ పే, ఆర్టీజీఎస్తో సహా డబ్బు బదిలీలు నెట్వర్క్ సమస్యతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, వ్యాపారాలు కూడా తగ్గిపోయాయన్నారు. ప్రజలు తమ మొబైల్ సంభాషణలను చేయడానికి కూడా ఇబ్బందులు పడుతున్నారన్నారు. గత రెండు మూడు నెలల నుంచి ఈ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. జామర్ సామర్థ్యాన్ని తగ్గించి స్థానికుల సమస్యలకు పరిష్కారం కల్పించాలన్నారు. జైల్లో ఉన్న ఖైదీల భద్రత కోసం జామర్ ఏర్పాటు చేయడం మంచిదే అయినా జైలు నగర శివార్లలో ఉండి ఉంటే ఇలా జామర్ను ఏర్పాటు చేయడం ఎంతో ఉపయోగకరం అన్నారు. నగర నడిబొడ్డున జైలు ఉన్నప్పటికీ జామర్ సామర్థ్యాన్ని ప్రజలకు అనుకూలం అయ్యేలా తగ్గించాలని కోరినట్లు తెలిపారు. బీజేపీ జిల్లాధ్యక్షుడు అనిల్నాయుడు, కార్పొరేటర్ గుడిగంటి హనుమంతు, కార్పొరేటర్ కే.హనుమంతు, మహిళా నాయకురాలు పుష్ప తదితరులు పాల్గొన్నారు.
సామర్థ్యం తగ్గించాలని
జైలు సూపరింటెండెంట్కు వినతి