
వైరల్ వర్రీ
ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో ఓపీ వద్ద క్యూలో రోగులు
కరీంనగర్టౌన్:
వాతావరణంలో నెలకొన్న మార్పులతో జిల్లాను జ్వరాలు వణికిస్తున్నాయి. డెంగీ, వైరల్ ఫీవర్లు విజృంభిస్తున్నాయి. నగరంతో పాటు పల్లెల్లో జ్వరాలవ్యాప్తి అధికంగా ఉంది. ప్రతీఇంట్లో ఒకరిచొప్పున మంచం పట్టారు. కొందరు పీహెచ్సీలకు వెళ్తుండగా, మరికొందరు జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ప్రధానాసుపత్రి (జీజీహెచ్), ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. ఇంకొందరు ఆర్ఎంపీ, పీఎంపీలను ఆశ్రయిస్తున్నారు.
జిల్లాలో డెంగీ కేసులు ఇలా
జిల్లావ్యాప్తంగా వైద్య ఆరోగ్యశాఖ వివరాల ప్రకారం ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 52 డెంగీ కేసులు నమోదయ్యాయి. ప్రైవేటు ఆస్పత్రుల్లో నమోదయ్యే డెంగీ కేసులతో కలిపితే సంఖ్య మూడింతలు ఉండే అవకాశముందని వైద్యులు చెబుతున్నారు. వైరల్ జ్వరాల బారిన పడినవారు వేలసంఖ్యలో ఉన్నట్లు తెలుస్తోంది.
అంతటా జ్వరపీడితులు
జిల్లాలోని అన్ని పీహెచ్సీల పరిధిలో జ్వర పీడితులు అధికంగా నమోదవుతున్నారు. వాతావరణ మార్పులు ఇందుకు కారణంగా వైద్యులు చెబుతున్నారు. ఇటీవల కురిసిన జోరువానలతో దోమలు వృద్ధిచెంది, జ్వర బాధితులు పెరుగుతున్నారు. రెండుమూడు రోజుల కన్నా ఎక్కువగా జ్వరం ఉన్నవారు జీజీహెచ్కు వచ్చి వైద్యం పొందుతున్నారు. వీరంతా వైరల్జ్వరాలతోనే వస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు.
భయపెడుతున్న ప్లేట్లెట్ల సంఖ్య
డెంగీ, వైరల్ జ్వరాల బారిన పడిన వారికి ప్లేట్లెట్ల సంఖ్య తగ్గిపోతున్నాయి. 50వేలకు తగ్గిపోగానే హడలిపోయి ఆస్పత్రులకు పరుగు తీస్తున్నారు. దీంతో ప్రైవేటు ఆస్పత్రుల నిర్వాహకులు అందినకాడికి దండుకుంటున్నారు. ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్తున్న రోగులకు బిల్లులు తడిసిమోపెడవుతున్నాయి. రెండు మూడు రోజుల పాటు అడ్మిట్ ఉంటే రోజుకు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు వసూలు చేస్తున్నారు. వారం రోజులకే రూ.లక్ష వర కు బిల్లు వేస్తున్నారని పలువురు వాపోతున్నారు.
ఆసుపత్రులు కిటకిట
ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు జ్వర పీడితులతో నిండిపోతున్నాయి. జిల్లాలో ప్రైవేటు ఆసుపత్రులు 350 వరకు ఉన్నాయి. ప్రభుత్వ ప్రధానాసుపత్రితో పాటు 18 ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, 6 అర్భన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 4 కమ్యూనిటీ ఆసుపత్రులు, రెండు బస్తీ దవాఖానాలు ఉన్నాయి. ఓపీలో కొందరు చికిత్స పొందుతుండగా, మరికొందరు ఇన్పేషెంట్లుగా ఉన్నారు.

వైరల్ వర్రీ