పల్లెతల్లీ.. ప్రణమిల్లి | - | Sakshi
Sakshi News home page

పల్లెతల్లీ.. ప్రణమిల్లి

Jun 29 2025 2:53 AM | Updated on Jun 29 2025 2:58 AM

విద్యానగర్‌ (కరీంనగర్‌)/సిరిసిల్లకల్చరల్‌:

బోనం అంటే భోజనం. అమ్మ ప్రసాదించిన ఆహారాన్ని అమ్మకే నివేదించడం బోనాల సంప్రదాయం. జగన్మాత ఉత్సవంలో ఘటం, బోనం, రంగం.. అంటూ మూడు అంకాలుంటాయి. శక్తి పూజకు సీ్త్రమూర్తులే ప్రధానమైన భూమిక పోషించడం బోనాల ప్రత్యేకత. కొత్త కుండకి సున్నం, పసుపు రాసి, కుంకుమ అద్దుతారు. చందనం చల్లుతారు. వరి లేదా జొన్నతో నింపిన ఘటానికి మామిడాకులు, వేపరెమ్మలు కడతారు. దీపం వెలిగించడానికి అనుకూలంగా కుండపైన మట్టి మూకుడు పెడతారు. అలా ఘటాలను అలంకరించి, ఊరేగింపుగా వెళ్లి అమ్మవారలకు బోనాలు సమర్పిస్తారు. దేహదారుఢ్యం కలిగిన వ్యక్తిని పోతురాజుగా ముందు నిలబెడతారు. అన్ని ఇళ్ల నుంచి బోనాన్ని సేకరించడం పోతురాజు బాధ్యత. బోనాల సమర్పణకు ముగింపుగా ఆ ఏటి భవిష్యత్తును ప్రకటించడమే ‘రంగం’. ఓ భక్తురాలే భవిష్యవాణిని వినిపిస్తుంది.

విశ్వవ్యాప్తం

తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టి జనపదాల్లో పుట్టిన ఈ వేడుక నేడు విశ్వవ్యాప్తమైంది. ఆషాఢమాసంలో జగన్మాతకు భక్తితో సమర్పించే భోజన నైవేద్యాలలే బోనాలు. భోజన పదమే జనవ్యవహారంలో బోనంగా మారింది. ప్రతీ ఇల్లు సిరులతో నిండి అందరూ ఆయురారోగ్య భాగ్యాలతో విలసిల్లాలని వేడుకోవడం బోనాల పండుగలోని ప్రత్యేకత.

తెలంగాణ తల్లికి బోనం

మెట్లకు బొట్లు, గట్లకు పూజ. గోపురాల కొత్త పరిమళ గుబాలింపు. అమ్మ రుణం తీర్చుకునే వేడుకల్లో ఇవన్నీ భాగమే. అమ్మవారు ఆప్యాయతల అన్నప్రసాదాన్ని స్వీకరిస్తుందోనని.. అంబారీనెక్కి ఆశీర్వాదాలు పలుకుతుందోనని.. రంగమెత్తి సందేశమిస్తుందోనని ‘అమ్మా.. తల్లీ.. కాపాడమ్మా’ అని వేడుకునే మనుసులు ఆషాఢమాసం నెల పాటు ఉత్సవాలు చేసుకుంటారు. ఊరుగాచే ఆ తల్లికి బోనం పెట్టే బిడ్డలు ఉన్నది ప్రపంచంలో ఒక్క తెలంగాణలోనే.

గోల్కొండలో తొలి బోనం

ఆషాఢమాసంలో గోల్కొండ ఖిల్లా వేదికగా, ఉజ్జయినీ తల్లి సాక్షిగా అమ్మకు బిడ్డలు తొలి వీరబోనమెత్తుకుంటే రాష్ట్రమంతటా బోనాల నగారా మోగుతుంది. గోల్కొండ కోటలోని శ్రీజగదాంబికా ఆలయంలో జరిగే ఉత్సవాలకు ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. ఇది తరాలు మారినా తరగని తెలంగాణ సంస్కృతికి నిదర్శనం.

బోనంతో అనుబంధం

ఆషాఢానికి బోనాలు ఆరంభమై శ్రావణానికి గ్రామాలకు చేరి గ్రామదేవతలైన మైసమ్మ, పోచమ్మ, పెద్దమ్మ, రేణుక ఎల్లమ్మల రుణం తీర్చుకుంటాయి. అదే ఆ అమ్మలకు ఈ బిడ్డలకు ఉన్న అనుబంధం. 500 ఏళ్ల క్రితం మలేరియా వల్ల ప్రాణాలు పోతున్న వేళ జనాన్ని రక్షించేందుకు పెట్టిన తొలి బోనం ఆనవాయితీ ఇప్పటికీ కొనసాగడం అంటే అమ్మ– బిడ్డల అనుబంధానికి నిదర్శనం.

చరిత్ర వైభవం

పురాణగాథలు, చారిత్రక నేపథ్యాలతో సంబంధం లేకుండా ఆయా ప్రాంతాల ప్రజలు బంధుమిత్రులు, కుటుంబాలతో కలిసిమెలిసి ఈ పండుగ జరుపుకుంటున్నారు. గోల్కొండ జగదాంబిక (ఎల్లమ్మ) ఆలయంలో మొదలయ్యే బోనాలు లష్కర్‌ ఉజ్జయినీ మహంకాళి, లాల్‌దర్వాజ సింహవాహిని, హరిబౌలి మహంకాళి ఆలయాల్లో జాతర వేడుకలు జరుగుతాయి. గోల్కొండ బోనాలకు 500 ఏళ్లు, ఉజ్జయినీ బోనాలది 200 ఏళ్ల చరిత్ర. లాల్‌దర్వాజ బోనాలకు వందేళ్ల చరిత్ర ఉంది.

అమ్మవారికి బోనం సమర్పిస్తాం

ఏటా ఆషాఢమాసంలో మా ఇంటి నుంచి పోచమ్మతల్లికి బోనం సమర్పిస్తాం. వాడలోని వారందరితో డప్పుచప్పుల్లతో ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి నైవేద్యం పెట్టి, మొక్కులు చెల్లించి సల్లంగా చూడాలని వేడుకుంటాం.

– చొప్పరి జయశ్రీ, మాజీ కార్పొరేటర్‌, కరీంనగర్‌

పల్లెతల్లీ.. ప్రణమిల్లి1
1/2

పల్లెతల్లీ.. ప్రణమిల్లి

పల్లెతల్లీ.. ప్రణమిల్లి2
2/2

పల్లెతల్లీ.. ప్రణమిల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement