
గడ్డి మందును నిషేధించాలి
కరీంనగర్అర్బన్: పారా క్వాట్ హెర్బిసైడ్ (గడ్డిమందు)పై దేశవ్యాప్తంగా నిషేధం విధించేలా చర్యలు తీసుకోవాలని హెల్త్కేర్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్ (హెచ్ఆర్డీఏ) జిల్లా శాఖ, డాక్టర్స్ అగైన్ట్స్ పెరాక్విడ్ పాయిజన్ (డీఏపీపీ) శనివారం కలెక్టర్ పమేలా సత్పతికి ఫిర్యాదు చేసింది. పారాక్వాట్ అత్యంత విషపూరితమైన ఔషధమని, 10–15 మి.లీ తాగినా మృతిచెందడమేనని, ఇది చాలా వేగంగా గుండె, మూత్రపిండాలు, ఊపిరితిత్తుల్ని దెబ్బతీసి మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్కు దారితీస్తుందని వివరించారు. సదరు గడ్డి మందు తీసుకొని దేశంలో చాలామంది అత్యంత సాధారణంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. దీనికి విరుగుడు మందు లేకపోవడం వల్ల 50 శాతం నుంచి 90 శాతం వరకు మృత్యువాత పడుతున్నారని, పొలాలపై వేసే క్రమంలో తెలియకుండానే రైతుల ఊపిరితిత్తుల్లోకి వెళ్లి తీవ్రమైన అనారోగ్యాలకు గురి అవుతున్నారని తెలిపారు. పారా క్వాట్ ఉత్పత్తి, అమ్మకం, నిల్వ, వినియోగంపై తక్షణ నిషేధం విధించాలని, మార్కెట్లో ఉన్న స్టాక్ను వెనక్కి తీసుకొని సురక్షితంగా నిర్వీర్యం చేయాలన్నారు. పారాక్వాట్ విష ప్రయోగాలను పర్యవేక్షించేందుకు శ్రీపాయిజన్ రిజిస్ట్ఙ్రీ ఏర్పాటు చేయాలని, యూరప్, బ్రిటన్, బ్రెజిల్, చైనా, శ్రీలంక, దక్షిణకొరియా లాంటి దేశాలు ఇప్పటికే నిషేధించాయని పేర్కొన్నారు. హెల్త్ కేర్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు డా.బండారి రాజ్కుమార్, ఉపాధ్యక్షుడు డా.పి.గౌతమ్, ప్రధాన కార్యదర్శి డా.జిఎస్.శరణ్ పాల్గొన్నారు.