
ఏసీబీ వలలో మున్సిపల్ ఔట్సోర్సింగ్ ఉద్యోగి
● ఇంటి నంబర్ కోసం లంచం
● రూ.5 వేలు తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు
సుల్తానాబాద్(పెద్దపల్లి): ఇంటి నంబరు కేటాయించాలని దరఖాస్తు చేసిన వ్యక్తి నుంచి రూ.5 వేలు లంచం తీసుకుంటూ మున్సిపల్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి నాంపల్లి విజయ్కుమార్ను ఏసీబీ అధికారులు శనివారం రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ విజయ్కుమార్ కథనం ప్రకారం.. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని ఆర్నకొండ ప్రసాద్ ఇటీవల ఇల్లు నిర్మించుకున్నారు. దానికి ఇంటి నంబరు కేటాయించాలని అధికారులను ఆశ్రయించారు. అయితే, రూ.10 వేలు లంచం ఇస్తేనే ఇంటి నంబరు కేటాయిస్తామని అధికారులు డిమాండ్ చేశారు. తాను రూ.3 వేలు చెల్లిస్తానని బతిమిలాడినా వినలేదు. చివరకు రూ.5 వేలకు ఒప్పందం కుదిరింది. శనివారం పట్టణంలోని ఓ దుకాణంలో ఆర్నకొండ ప్రసాద్ రూ.5 వేలు ఇస్తుండగా మున్సిపల్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి నాంపల్లి విజయ్ కుమార్ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ వ్యవహారంలో మున్సిపల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ వినోద్ కుమార్నూ అదుపులో తీసుకున్నారు. ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్, సీఐ కృష్ణకుమార్, సిబ్బంది పున్నం చందర్, తిరుపతి పాల్గొన్నారు. నిందితులను ఆదివారం కోర్టులో హాజరు పర్చనున్నామని అధికారులు తెలిపారు. కాగా, ఇంటి నంబరు కేటాయించాలని బాధితుడు రెండేళ్లుగా తిరుగుతున్నాడని ఏసీబీ అధికారులు పేర్కొన్నారు.

ఏసీబీ వలలో మున్సిపల్ ఔట్సోర్సింగ్ ఉద్యోగి