
ఎంత పనిజేస్తివి కొడుకా..
ముస్తాబాద్(సిరిసిల్ల): ఎంత పనిజేస్తివి కొడుకా.. పిల్లలు లేరని నిన్ను సాదుకుంటే మధ్యలో అన్యాయం చేస్తివా.. అంటూ ఆ మాతృమూర్తి రోదనలు స్థానికులు కన్నీరు పెట్టేలా చేశాయి. కట్టుకున్న భర్త ఆరేళ్ల క్రితం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడితే.. సంతానం లేక ఆసరాగా ఉంటాడనుకున్న దత్తకొడుకు సైతం ఆత్మహత్యకు పాల్పడడంతో ఆ తల్లి ఒంటరైంది. పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్న తెల్ల వారే యువకుడు ఆత్మహత్యకు పాల్పడడంతో ఆ తల్లి రోదనలు మిన్నంటాయి. పోలీసులు, కుటుంబీకులు తెలిపిన వివరాలు. ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన బద్దిపడిగె మల్లారెడ్డి, విజయ దంపతులకు సంతానం కలగకపోవడంతో అజయ్రెడ్డిని దత్తత తీసుకుని పెంచుకుంటున్నారు. ఆరేళ్ల క్రితం తండ్రి మల్లారెడ్డి ఆత్మహత్య చేసుకోగా, తల్లి విజయ అన్నీ తానై కొడుకును పోషిస్తోంది. ముస్తాబాద్లోని ఓ పెట్రోల్బంకులో పనిచేస్తున్నాడు. శుక్రవారం పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న మరుసటి రోజే ఆత్మహత్యకు పాల్పడడంతో తల్లి విజయ రోదనలు మిన్నంటాయి. ఆరేళ్ల క్రితం భర్త ఆత్మహత్య చేసుకోగా, ఇప్పుడు కుమారుడు అజయ్రెడ్డి(22) కూడా ప్రాణాలు తీసుకోవడంతో విజయ ఒంటరైంది. యువకుడి మృతికి గల కారణాలపై విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
దత్తపుత్రుడి మృతితో ఒంటరైన తల్లి
ఆరేళ్ల క్రితం తండ్రి.. నేడు కొడుకు మృతి