
పునర్విభజనపై రగడ
● అన్ని రాజకీయ పార్టీలకు అభ్యంతరమే ● ఓటర్ల సంఖ్యపై బల్దియా కసరత్తు ● రెండో రోజు 32 అభ్యంతరాలు
కరీంనగర్ కార్పొరేషన్:
డివిజన్ల పునర్విభజనపై రాజకీయ రగడ మొదలైంది. నగరాన్ని 66 డివిజన్లుగా విభజిస్తూ నగరపాలకసంస్థ ప్రకటించిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్పై పార్టీలు పరస్పర ఆరోపణలకు దిగుతున్నాయి. పునర్విభజనపై అన్ని పార్టీలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఎక్కువగా ఆయా డివిజన్లలో పేర్కొన్న ఓట్ల సంఖ్య ప్రధాన సమస్యగా కనిపిస్తోంది. ఇంటినంబర్లతో లెక్కకట్టిన ఓట్లు సరిగా లేవని, ఒక డివిజన్లో ఎక్కువగా, మరో డివిజన్లో తక్కువగా ఉన్నాయంటూ ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దీంతో బల్దియా కూడా ఆయా డివిజన్లలోని ఇంటినంబర్ల వారీగా మరో సారి ఓట్ల సంఖ్యను లెక్కించే పనిలో పడింది.
అన్ని పార్టీలకు అభ్యంతరమే
నగరంలో 66 డివిజన్ల పునర్విభజనపై అన్ని పార్టీ లు అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండడం గమనార్హం. అధికార కాంగ్రెస్తో పాటు, బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎంలు డివిజన్ల పునర్విభజన సరిగా లేదంటూ ఫిర్యాదు చేస్తున్నాయి. తాము ప్రాతినిథ్యం వహిస్తున్న డివిజన్ల విభజన సరిచేయాలంటూ కాంగ్రెస్ మాజీ కార్పొరేటర్లు వరుసగా అభ్యంతరాలు ఇస్తున్నారు. ఓట్ల సంఖ్యలో తేడా, ఆర్అండ్బీ రోడ్డుకు రెండు వైపుల ఉన్న ప్రాంతాన్ని నిబంధనలకు విరుద్ధంగా ఒకే డివిజన్లో చేర్చడంపై బీఆర్ఎస్ కలెక్టర్కు ఫిర్యాదు చేసింది. ఎంఐఎం, కాంగ్రెస్లకు అనుకూలంగా విభజించారని బీజేపీ ఆరోపిస్తుండగా, బీజేపీకి అనుకూలంగా విడగొట్టారని ఎంఐఎం ఎదురుదాడి చేస్తోంది. రాజకీయపార్టీల అభ్యంతరాల్లో ఎక్కువగా ఓట్ల సంఖ్యలో తేడా, ఇంటి నంబర్ల గందరగోళం, ఆర్అండ్బీ రోడ్డుకు ఇరువైపులా ఒకే డివిజన్ అంశాలే ఉన్నాయి. ఇంటినంబర్ల వారీ గా లెక్కించిన ఓట్ల సంఖ్య ఒక డివిజన్లో ఎనిమిది వేలు, మరో డివిజన్లో రెండు,మూడు వేలు మాత్ర మే ఓట్లున్నాయని బీఆర్ఎస్ వాదిస్తోంది. అన్ని డివిజన్లను ఐదు వేల ఓట్లుగా చూపిస్తున్నా, వాస్తవ ఓట్ల సంఖ్యకు పొంతన ఉండడం లేదంటున్నాయి.
ఓటర్ల సంఖ్యపై బల్దియా కసరత్తు
డివిజన్లలో పేర్కొన్న ఓట్లకు, వాస్తవ ఓట్లకు పొంతన లేదంటూ వస్తున్న అభ్యంతరాల నేపథ్యంలో నగరపాలకసంస్థ ఓట్లసంఖ్యపై దృష్టి సారించింది. అభ్యంతరాల అనంతరం పరిశీలనకు సమయం ఉన్నా, ఇప్పటి నుంచే ఆయా డివిజన్లలో ఉన్న ఇళ్లు, ఓట్ల సంఖ్యపై మరోసారి కసరత్తు మొదలు పెట్టింది. డ్రాఫ్ట్లో పేర్కొన్న ఓట్లకు వాస్తవ ఓట్లకు తేడా ఉంటే, ఆ డివిజన్ల సరిహద్దులు మార్చేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు.
రెండో రోజు 32అభ్యంతరాలు
పునర్విభజనపై రెండవ రోజు శుక్రవారం 32మంది తమ అభ్యంతరాలను వ్యక్తం చేశారు. ఓట్లను సరిచేయాలని, ఆర్అండ్బీ రోడ్డు నిబంధన పాటించాలని బీఆర్ఎస్ నగరశాఖ అధ్యక్షుడు చల్ల హరిశంకర్ విజ్ఞప్తి చేశారు. పాత 9వ డివిజన్, కొత్త 29వ డివిజన్ను అశాసీ్త్రయంగా విజభించారని మాజీ కార్పొరేటర్ పడిశెట్టి భూమయ్య ఫిర్యాదు చేశారు. కొత్త 9వ డివిజన్లో ఇంటినంబర్లను సరిచేయాలని మాజీ కార్పొరేటర్ ఆకుల నర్మద కోరారు. అంబేడ్కర్నగర్లో మధ్యలో ఉన్న ఇళ్లను పక్క డివిజన్లో వేశారని, వీటిని సరిచేయాలని సామాజిక కార్యకర్త మహమ్మద్ అమేర్ కోరారు.
డివిజన్ల పునర్విభజనపై కలెక్టర్కు వినతి
కరీంనగర్: శాసీ్త్రయబద్ధంగా విభజన ప్రక్రియ కొనసాగించాలని బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్లా హరిశంకర్ కలెక్టర్ పమేలా సత్పతికి వినతిపత్రం ఇచ్చారు. నగరపాలక సంస్థ ప్రకటించిన 66 డివిజన్లలో తెలిపిన ఇంటి నంబర్లకు సంబంధించిన ఓటర్ల సంఖ్య అసంబద్ధంగా ఉందన్నారు. డీలిమిటేషన్పై వెంటనే విచారణ జరిపించి, తప్పుడు సమాచారంతో కరీంనగర్లో ప్రజలను, నాయకులను ఆందోళనకు గురిచేసిన అధికారులపై చర్య తీసుకోవాలన్నారు. బీఆర్ఎస్ నాయకులు కంసాల శ్రీనివాస్, గుగ్గిళ్ల జయశ్రీ, దిండిగాల మహేశ్, కుర్ర తిరుపతి, సంపత్రావు పాల్గొన్నారు.

పునర్విభజనపై రగడ