ఆర్టీసీ బస్సు ఢీకొని హనుమాన్‌ దీక్షపరుడు మృతి | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు ఢీకొని హనుమాన్‌ దీక్షపరుడు మృతి

May 3 2025 11:24 AM | Updated on May 3 2025 11:24 AM

ఆర్టీ

ఆర్టీసీ బస్సు ఢీకొని హనుమాన్‌ దీక్షపరుడు మృతి

జగిత్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని నటరాజ్‌ చౌరస్తా వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొని టీఆర్‌నగర్‌ గ్రామానికి చెందిన కొడిక్యాల కృష్ణమూర్తి (53) అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హనుమాన్‌ దీక్ష తీసుకున్న కృష్ణమూర్తి శుక్రవారం సాయంత్రం బ్యాంక్‌ పని నిమిత్తం తన ద్విచక్రవాహనంపై జగిత్యాలకు వచ్చి నటరాజ్‌ చౌరస్తా వద్ద రోడ్డు దాటుతుండగా నిజామాబాద్‌ నుంచి హన్మకొండ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు అతివేగంగా వచ్చి ఢీకొంది. తీవ్రగాయాలు కావడంతో 108లో జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి భార్య రమాదేవి ఫిర్యాదు మేరకు ఆర్టీసీ డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై కిరణ్‌ తెలిపారు. ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి మృతుడి కుటుంబసభ్యులను ఓదార్చారు.

రైల్వే కాంట్రాక్టు ఎలక్ట్రిషన్‌..

కొత్తపల్లి(కరీంనగర్‌): కొత్తపల్లి రైల్వే స్టేషన్‌లో కాంట్రాక్టు ఎలక్ట్రిషన్‌గా పని చేస్తున్న విశాఖపట్టణం చిన్నవాల్తేరుకాలనీకి చెందిన షైక్‌ సుభాహని(52) మద్యానికి బానిసై అనారోగ్యంతో మృతిచెందినట్లు ఏఎస్సై రాంమూర్తి తెలిపారు. ఏఎస్సై వివరాల ప్రకారం.. సుభాహని కొత్తపల్లి రైల్వే స్టేషన్‌లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నంద్యాల జిల్లా సుజమల మండలం ముదిగేడు గ్రామానికి చెందిన షేక్‌ హుస్సేన్‌ అనే సూపర్‌వైజర్‌ వద్ద ఎలక్ట్రిషన్‌ పనులు చేస్తున్నాడు. నాలుగు రోజులుగా విపరీతంగా మద్యం తాగుతూ భోజనం చేయడం మానేశాడు. గత నెల 29న సుభాహని అపస్మారక స్థితిలోకి వెళ్లగా.. చికిత్స నిమిత్తం కరీంనగర్‌లోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు మృతిచెందినట్లు నిర్ధారించడంతో మార్చురీ గదిలో శవాన్ని భద్రపరచారు. మృతుడి కుటుంబ సభ్యుల కోసం ఆరా తీయగా.. ఎలాంటి సమాచారం లభించలేదు. సూపర్‌వైజర్‌ హుస్సేన్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై పేర్కొన్నారు.

చెట్టుకు కారు ఢీకొని యువకుడు..

కథలాపూర్‌: మండలంలోని చింతకుంటకు చెందిన గాజ బ్రహ్మానంద స్వామి (30) అనే యువకుడు శుక్రవారం సాయంత్రం కారులో వెళ్తూ చెట్టును ఢీకొట్టడంతో తీవ్ర గాయాలపాలై మృతి చెందినట్లు ఎస్సై నవీన్‌కుమార్‌ తెలిపారు. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పనిచేస్తున్న బ్రహ్మానంద స్వామి శుక్రవారం స్వగ్రామానికి వచ్చి తన బంధువు కారులో గ్రామశివారుకు స్నేహితులతో కలిసి వెళ్లారు. చెట్టుకు కారు ఢీకొట్టడంతో బ్రహ్మానందస్వామి తలకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం హైదరాబాద్‌ తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడన్నారు. మృతుడికి ఏడాది క్రితం వివాహం జరిగింది. కేసు నమోదు చేసినట్లు ఎస్సై నవీన్‌ కుమార్‌ తెలిపారు.

లారీ ఢీకొని మల్టీపర్పస్‌ వర్కర్‌..

పెద్దపల్లిరూరల్‌: పెద్దపల్లి మండలం సబ్బితం గ్రామంలో శుక్రవారం లారీ ఢీకొన్న ప్రమాదంలో ఎడెల్ల నర్సయ్య(46) దుర్మరణం పాలయ్యాడు. సబ్బితం గ్రామానికే చెందిన నర్సయ్య గ్రామ పంచాయతీ కార్యాలయంలో మల్టీపర్పస్‌ వర్కర్‌గా పనిచేస్తున్నాడు. సైకిల్‌పై రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మరణించాడని బసంత్‌నగర్‌ ఎస్సై స్వామి తెలిపారు. మృతుడికి భార్య కనకమ్మ, కుమారుడు రాజశేఖర్‌ ఉన్నారు.

విద్యుదాఘాతంలో గేదె..

బుగ్గారం: మండలంలోని గోపులాపూర్‌లో శుక్రవారం విద్యుదాఘాతంతో గేదె మృతి చెందింది. వివరాలు ఇలా.. మ్యాదరవేని విజయకు చెందిన గేదె శుక్రవారం ఊరు బయట మినీ ట్రాన్స్‌ఫార్మర్‌ వద్ద మేత మేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్‌ వైరుకు తగిలి అక్కడికక్కడే మృతి చెందింది. దీని విలువ 85 వేలు ఉంటుందని ప్రభుత్వం ఆదుకోవాలని బాదితురాలు విజయ తెలిపారు.

కడుపునొప్పి భరించలేక వృద్ధుడి ఆత్మహత్య

మానకొండూర్‌: మండలంలోని పోచంపల్లిలో కడుపునొప్పి భరించలేక వృద్ధుడు శుక్రవారం ఉరేసుకున్నాడు. సీఐ సంజీవ్‌ తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన పోలం పోచాలు(79) పదిహేనేళ్లుగా కడుపునొప్పి, ఫిట్స్‌ వ్యాధితో బాధపడుతున్నాడు. మందులు వాడుతున్నా నయం కాకపోవడంతో మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరులేని సమయంలో బాత్‌రూం పక్కన ఉరేసుకున్నాడు. మృతుడికి ఇద్దరు కుమారులు, కూతురు. కుమారుడు రవి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.

ఆర్టీసీ బస్సు ఢీకొని     హనుమాన్‌ దీక్షపరుడు మృతి
1
1/2

ఆర్టీసీ బస్సు ఢీకొని హనుమాన్‌ దీక్షపరుడు మృతి

ఆర్టీసీ బస్సు ఢీకొని     హనుమాన్‌ దీక్షపరుడు మృతి
2
2/2

ఆర్టీసీ బస్సు ఢీకొని హనుమాన్‌ దీక్షపరుడు మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement