
కంప్యూటర్ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
● కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్అర్బన్: సమ్మర్ క్యాంపులో భాగంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కంప్యూటర్ రంగంలో ఇస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కలెక్టరేట్లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ ప్రాంతీయ శిక్షణ కేంద్రంలో శిక్షణ తరగతులను ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలో చదివే విద్యార్థులు వేసవి సెలవుల్లో విభిన్న రంగాల్లో నైపుణ్యం సాధించాలనే ఉద్దేశంతో ఈ శిక్షణ ప్రారంభించినట్లు వివరించారు. నాలుగు వారాలపాటు జరిగే శిక్షణలో 50 మంది విద్యార్థులకు బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్, ఫొటోషాప్ స్కిల్లో శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఉదయం, సాయంత్రం 25 మంది చొప్పున విద్యార్థులకు థియరీతోపాటు ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇస్తామని పేర్కొన్నారు. ప్రతీ విద్యార్థి రోజూ ఒక పేజీ చేతి రాత ప్రాక్టీస్ చేయాలని అన్నారు. అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్దేశాయ్, నెహ్రూ యువకేంద్ర కోఆర్డినేటర్, ప్రాంతీయ శిక్షణ కేంద్రం మేనేజర్ రాంబాబు, క్వాలిటీ కోఆర్డినేటర్ అశోక్రెడ్డి, కేజీబీవీ కోఆర్డినేటర్ కృపారాణి, సంతోష్ పాల్గొన్నారు.