వైద్య కళాశాలల పనులు సకాలంలో పూర్తవ్వాలి

వీసీలో పాల్గొన్న కలెక్టర్‌ కర్ణన్‌, అధికారులు - Sakshi

కరీంనగర్‌టౌన్‌: రాష్ట్రంలో నూతన వైద్య కళాశాలల నిర్మాణ పనులు సకాలంలో పూర్తవ్వాలని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. మంగళవారం హైదరాబాద్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా రాష్ట్రంలో నిర్మిస్తున్న 9 వైద్య కళాశాలల పనుల పురోగతిపై ఆయా జిల్లాల కలెక్టర్లు, వైద్యారోగ్యశాఖ అధికారులు, సంబంధిత ఇంజినీరింగ్‌ ఏజెన్సీల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులతో టీఎస్‌ఎంఐడీసీ డైరెక్టర్‌ చంద్రశేఖర్‌ రెడ్డితో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజలందరికీ మెరుగైన వైద్య సేవలందించాలనే ఉద్దేశంతో రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో మెడికల్‌ కాలేజీ ఏర్పాటుపై సీఎం కేసీఆర్‌ దృష్టిసారించారని చెప్పా రు. ఈ సంవత్సరం కరీంనగర్‌, కామారెడ్డి, జనగామ, వికా రాబాద్‌, ఖమ్మం, జయశంకర్‌ భూపాలపల్లి, రాజన్న సిరిసిల్ల, కొమురంభీం ఆసిఫాబాద్‌, నిర్మల్‌ జిల్లాల్లో నూ తన కళాశాల పనుల జరుగుతున్నాయని తెలిపారు. జూలై నుంచి మొదటి విడత అడ్మిషన్స్‌ ప్రారంభమవుతున్న నేపథ్యంలో కాలేజీలను సిద్ధం చేసి, ఎస్‌ఎంసీ నుంచి అనుమతి పొందాలన్నారు. కరీంనగర్‌ జిల్లాలో ఆరోగ్య మహిళా కేంద్రాలకు అధిక సంఖ్యలో మహిళల రప్పిస్తూ మంచి ఫలితాలు సాధించిన కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌ను మంత్రి అభినందించారు. కంటి వెలుగు కార్యక్రమంపై కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు నిరంతర పర్యవేక్షణ చేయాలన్నారు. వీసీలో కలెక్టర్‌ కర్ణన్‌, అదనపు కలెక్టర్లు గరిమా అగర్వాల్‌, జీవీ శ్యాంప్రసాద్‌లాల్‌, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్‌ జువేరియా, జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రత్నమాల, టీఎస్‌ఎంఐడీసీ అధికారులు పాల్గొన్నారు.

రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు

కలెక్టర్‌ కర్ణన్‌కు అభినందన

Read latest Karimnagar News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top