తుని రూరల్: పగలంతా తీవ్రమైన ఉష్ణతాపంతో అల్లాడిన తుని మండల ప్రజలు.. సాయంత్రం ఒక్కసారిగా కురిసిన వర్షంతో సేద తీరారు. ఆదివారం తెల్లవారుజాము నుంచే కారు మబ్బులు కమ్ముకున్నా వర్షం కురవ లేదు. ఉదయం ఏడు గంటల తర్వాత సూర్యుడు భగభగమంటూ ప్రతాపం చూపించాడు. ఉష్ణోగ్రత గరిష్టంగా 34, కనిష్టంగా 26 డిగ్రీల సెల్సియస్ చొప్పున నమోదయ్యాయి. దీంతో, ప్రజలు ఆపసోపాలు పడ్డారు. సాయంత్రం ఆరు గంటల సమయానికి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆకాశంలో దట్టమైన కారు మబ్బులు మళ్లీ కమ్ముకున్నాయి. చల్లని ఈదురు గాలి వీయడంతో ప్రజలు సేద తీరారు. రాత్రి ఏడు గంటల తర్వాత ఒక మోస్తరు వర్షం కురవడంతో అప్పటి వరకూ వేసవి తాపంతో తల్లడిల్లిన ప్రజలకు ఒక్కసారిగా ఉపశమనం లభించింది. ఈదురు గాలులు, వర్షంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.


