ద్వారకా తిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల శ్రీవారి ఆలయ హుండీల ఆదాయాన్ని బుధవారం స్థానిక ప్రమోద కల్యాణ మండపంలో లెక్కించారు. ఏలూరు జిల్లా దేవదాయ శాఖ అధికారి కె.శ్రీనివాసు పర్యవేక్షణలో జరిగిన ఈ లెక్కింపులో స్వామివారికి విశేష ఆదాయం సమకూరింది. గడచిన 20 రోజులకు గాను నగదు రూపేణా రూ.2,20,68,980 ఆదాయం లభించినట్టు ఆలయ ఈఓ వి.త్రినాథరావు తెలిపారు. కానుకల రూపేణా భక్తులు సమర్పించిన 141 గ్రాముల బంగారం, 3.111 కేజీల వెండితో పాటు, అధికంగా విదేశీ కరెన్సీ లభించాయని వివరించారు. లెక్కింపులోకి రాని రద్దయిన పాత రూ.2,000, రూ.1,000, రూ.500 నోట్ల ద్వారా రూ.25,500 లభించినట్టు చెప్పారు. సగటున రోజుకు శ్రీవారికి రూ.11,03,449 ఆదాయం వచ్చినట్టు ఈఓ పేర్కొన్నారు. లెక్కింపులో శ్రీవారి దేవస్థానం అధికారులు, సిబ్బంది, సేవాదళం సభ్యులు పాల్గొన్నారు.


