అన్నవరం: జాతీయ రహదారిపై రాజమహేంద్రవరం – విశాఖపట్నం మార్గంలోని సత్యదేవుని నమూనా ఆలయం వద్ద వాన నీరు నిలవకుండా అన్నవరం దేవస్థానం అధికారులు చర్యలు చేపట్టారు. ఇక్కడ వర్షపు నీరు నిలిచిపోతూండటంతో ఆలయానికి, ప్రసాదాల కౌంటర్ వద్దకు వెళ్లేందుకు భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని ‘నీ దరి చేరేదెలా స్వామీ!’ శీర్షికన సోమవారం ప్రచురించిన కథనం ద్వారా ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. దీనిపై దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు స్పందించి, అక్కడ వాన నీరు నిలవకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ మేరకు నమూనా ఆలయం వద్ద వాన నీరు పోయేలా డ్రైన్ తవ్వి, దానిపై కాంక్రీట్ ఫ్లోరింగ్ చేస్తున్నారు. రెండు రోజుల్లో ఈ పనులు పూర్తవుతాయని అధికారులు తెలిపారు.
ఉద్యోగులకు జీతాలు చెల్లింపు
గత మూడేళ్లుగా దేవస్థానంలో ఉద్యోగులకు జీతాలు, విశ్రాంత ఉద్యోగులకు పెన్షన్లు ప్రతి నెలా ఒకటో తేదీనే చెల్లిస్తున్నారు. కానీ, ఈ నెలలో జాప్యం జరగడంతో పలువురు పెన్షనర్లు ఫోన్ల ద్వారా అధికారులను ఆరా తీశారు. దీనిపై ‘జీతాలు, పెన్షన్లు ఆలశ్యంపై చర్చ’ శీర్షికన ‘సాక్షి’ మంగళవారం ప్రచురించిన వార్తకు అధికారులు స్పందించారు. ఈ మేరకు ఉద్యోగులకు జీతాలు, విశ్రాంత ఉద్యోగులకు పెన్షన్లు చెల్లించారు. సంబంధిత చెక్కులపై ఈఓ సూర్యచక్రధరరావు సంతకాలు చేశారు.


