మృతుని కుటుంబానికి న్యాయం
చేయాలని ఆందోళన
తాళ్లరేవు: జాతీయ రహదారి 216 చెంతన కోరంగి వంతెన దిగువన గల రొయ్యల చెరువుల్లో పడి వినకోటి సత్తిబాబు(34) దుర్మరణం పాలయ్యాడు. కోరంగి ఎస్ఐ పి.సత్యన్నారాయణ, మృతుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు పటవల ఎస్సీపేటకు చెందిన సత్తిబాబు రొయ్యల చెరువుల వద్ద పనిచేస్తున్నాడు. అయితే చెరువు మధ్య భాగంలో చేరే మురుగును తొలగించేందుకు ఏర్పాటు చేసిన యంత్రంలో ప్రమాదవశాత్తూ కాలు చిక్కుకుపోయింది. దీంతో సత్తిబాబు నీటిలో మునిగిపోయి ఊపిరాడక మృతి చెందాడు. గమనించిన ఇతర కూలీలు హుటాహుటిన అతన్ని బయటకు తీసి తాళ్లరేవు సామాజిక ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతునికి భార్య, నాలుగేళ్ల కుమారుడు, ఎనిమిదేళ్ల కుమార్తె ఉంది. మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ కుటుంబసభ్యులు స్థానిక సామాజిక ఆస్పత్రి వద్ద ఆందోళన చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్తితి నెలకొంది. విషయం తెలుసుకున్న కోరంగి ఎస్ఐ సత్యనారాయణ అక్కడకు చేరుకుని ఆందోళనకారులతోపాటు, చెరువుల యజమాని రఘుతో మాట్లాడారు. మృతుని కుటుంబానికి న్యాయం చేస్తామని చెరువుల యజమాని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు.


