38 ద్విచక్ర వాహనాల స్వాధీనం
గొల్లప్రోలు (పిఠాపురం రూరల్): గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో పోలీసులు ఆదివారం కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించి, సరైన పత్రాలు లేని 38 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పిఠాపురం సీఐ జి.శ్రీనివాస్ కథనం ప్రకారం.. ఎస్పీ బిందుమాధవ్ ఆదేశాల మేరకు పిఠాపురం సర్కిల్ ఎస్సైలు ఎన్.రామకృష్ణ, వి.మణికుమార్, వంద మంది పోలీసు సిబ్బందితో కలసి తాటిపర్తి గ్రామంలో ఉదయం కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. అనుమానాస్పద వ్యక్తులు వివరాలు సేకరించి, అనుమానిత ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. పాత నేరస్తులు, అనుమానితులపై నిఘా మరింత కట్టుదిట్టం చేస్తామని, ఎవరైనా కొత్త వ్యక్తులు గ్రామంలోకి ప్రవేశించినా, అనుమానాస్పద కదలికలను గమనించినా పోలీసులకు సమాచారం అందించాలని సీఐ కోరారు.
ఉత్కంఠకు నేటితో తెర..
నేడు యానాం నియోజకవర్గ ఓట్ల లెక్కింపు
యానాం: కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి పరిధిలోని యానాం అసెంబ్లీ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు సోమవారం జరగనుంది. గత నెల 9న పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా యానాం నియోజకవర్గ ఓట్ల లెక్కింపు స్థానిక సర్వేపల్లి రాధాకృష్ణన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటిగ్ హాలులో ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. దీనికోసం విస్తృత బందోబస్తు చేసినట్టు రిటర్నింగ్ అధికారి శివరాజ్ మీనా తెలిపారు. ఈ ఎన్నికల్లో మొత్తం 35,445 మంది ఓటర్లతో పాటు 360 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కళాశాలలో ఉదయం 5 గంటలకు జనరల్ అబ్జర్వర్ సమక్షంలో ఈవీఎంలను ర్యాండమైజ్ చేసి, 7.30 గంటలకు కౌటింగ్ కేంద్రానికి చేరుస్తారు. తొలుత 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్లను ఒక టేబుల్ వద్ద, 8.30 గంటలకు మరో 10 టేబుళ్లపై ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభించనున్నారు. మొత్తం 5 రౌండ్లలో 42 పోలింగ్ బూత్లకు సంబంధించి ఓట్లు లెక్కిస్తారన్నారు. ఫలితం మధ్యాహ్నం 12 గంటలకు ప్రకటిస్తారు. ఈ ఎన్నికల్లో స్వతంత్రులతో కలిపి మొత్తం 14 మంది పోటీ చేయగా ప్రధానంగా కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ ఎన్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి మల్లాడి కృష్ణారావు మధ్యే పోటీ నెలకొంది.


