యాజమాన్య పద్ధతులకు ప్రాధాన్యమివ్వాలి | - | Sakshi
Sakshi News home page

యాజమాన్య పద్ధతులకు ప్రాధాన్యమివ్వాలి

Jun 10 2025 7:12 AM | Updated on Jun 10 2025 7:12 AM

యాజమా

యాజమాన్య పద్ధతులకు ప్రాధాన్యమివ్వాలి

నారుమడుల సంరక్షణతో నాణ్యమైన

దిగుబడులు

రైతులు జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి

వ్యవసాయశాఖ సూచనలు పాటిస్తే మేలు

ఆలమూరు: ఖరీఫ్‌ పంటకు సంబంధించి నారుమళ్ల ప్రక్రియ జోరుగా సాగుతోంది. ఖరీఫ్‌లో అధిక శాతం వెదజల్లు సాగు చేపడుతుండగా మిగతా భూమిలో నారుమళ్ల ద్వారా సాగుకు రైతులు సమాయత్తమవుతున్నారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని 22 మండలాల్లో ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి 1.63 లక్షల ఎకరాల్లో రైతులు వరిసాగు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్నా ఇంకా అన్నదాత సుఖీభవ పథకంలో భాగంగా పెట్టుబడి సాయం అందకపోవడంతో ఖరీఫ్‌ మరింత జాప్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఖరీఫ్‌ సీజన్‌లో అధిక దిగుబడులను సాధించడంతో పాటు త్వరితగతిన కోతకు వచ్చే వరి వంగడాలకు రైతులు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. అందులో భాగంగా ప్రకృతి వైపరీత్యాలను తట్టుకోవడంతో పాటు త్వరితగతిన కోతకు వచ్చే అవకాశం ఉండటంతో వ్యవసాయశాఖ ఈ ఖరీఫ్‌లో స్వర్ణ (7029), ఎంటీయూ (1318), ఎంటీయూ (1121) రకాలు వినియోగించాలని సూచనలిస్తోంది. అయితే రైతుల మాత్రం ఏళ్ల తరబడి సంప్రదాయబద్ధంగా వస్తున్న స్వర్ణ (7029) రకానికి మాత్రమే ప్రాధ్యాన్యం ఇస్తున్నారు. నారుమళ్ల దశలో సరియైన యాజమాన్య పద్ధతులు, జాగ్రత్తలు, నష్ట నివారణ చర్యలు తీసుకోవడం ద్వారా చీడపీడలను నివారించడంతో పాటు నాణ్యమైన పంటలను పండించవచ్చునని వ్యవసాయశాఖ చెబుతోంది.

సస్యరక్షణ చర్యలు

నారుమడుల తయారీలో కనీస యాజమాన్య పద్ధతులు, సస్యరక్షణ చర్యలను పాటిస్తే పెట్టుబడి ఆదా అవడంతో పాటు నాణ్యమైన పంటలను పండించవచ్చునని ఆలమూరు వ్యవసాయశాఖ సహాయ సంచాలకులు కె.నాగేశ్వరరావు చెబుతున్నారు.

● తొలుత 80 శాతం మొలక కలిగిన నాణ్యమైన విత్తనాలను ఎంపిక చేసుకుని విత్తన శుద్ధి చేయాలి. నారుమడులను ఏర్పాటు చేసుకునేందుకు 10–12 రోజుల మధ్య దమ్ము చేసి నేలను చదును చేసుకోవాలి.

● పొలాల్లో నీరు పారేందుకు చిన్న చిన్న కాలువలను ఏర్పాటు చేసుకుని ప్రతి మొక్కకు నీరు అందేలా చూడాలి.

● ఐదు సెంట్ల నారుమడికి రెండు కిలోల నత్రజని, ఒక కిలో భాస్వరం, ఒక కిలో పోటాష్‌నిచ్చే ఎరువులను మిశ్రమం చేసి దుక్కులో వేయాలి.

● చలి తీవ్రత ఎక్కువగ ఉండే ప్రదేశంలో భాస్వరాన్ని రెట్టింపు చేయాలి.

● వరి నారు ఆకుగా విచ్చుకునే వరకూ ఆరుతడులుగా నీటిని అందించాలి. ఆకు కొద్దిగా ఎదిగి ఒక దశకు వచ్చిన తరువాత నీటిని నిల్వకట్టాలి.

● జింక్‌లోపం గమనిస్తే లీటరు నీటిలో రెండు గ్రాముల జింక్‌ సల్ఫేట్‌ను పిచికారీ చేయాలి.

● చలి ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో దాళ్వా వరి సాగుకు కనిపించే జింక్‌ లోప లక్షణాలను గుర్తిస్తే సత్వరమే వ్యవసాయశాఖ సూచనలు తీసుకోవాలి.

● నారు తీయడానికి వారం రోజుల ముందు ఎకరాకు సరిపడే ఐదు సెంట్లలో వేసిన నారుమడికి ఒక కేజీ కిర్టోప్యూరాన్‌ గుళికలను తక్కువ నీటిలో సమానంగా చల్లాలి.

నాట్లు వేసే ముందు తీసుకోవలసిన జాగ్రత్తలు

● వరి నారుమడి వేసే ముందు తప్పనిసరిగా విత్తన శుద్ధి చేయాలి.

● నారు వేయడానికి పక్షం రోజుల ముందు పొలాన్ని మురుగు దమ్ము చేయాలి.

● 15 సెంటీమీటర్లకు మించి లోతుగా దమ్ము చేయరాదు.

● పొలాన్ని దమ్ము చెక్కతో కాని యంత్ర పరికరంతో గాని చదును చేయాలి.

● నారుమడి లేత ఆకు రంగులో ఉన్నప్పుడే నాటడం ద్వారా త్వరగా మూన కడుతుంది.

● నాలుగు నుంచి ఆరు ఆకులు ఉన్న నారును ఉపయోగించుకుంటే ఫలితం ఉంటుంది.

● నారు ౖపైపెన ఉండే విధంగా నాటితే పిలకలు ఎక్కువగా తొడిగే అవకాశం ఉంటుంది.

● నారు వేసేటపుడు భూసారాన్ని బట్టి చదరపు మీటరుకు 33 మూనలు ఉండేటా నాటాలి.

● వరి నాట్లు నాటిన తరువాత ప్రతి రెండు మీటర్లకు 20 సెంటిమీటర్ల చొప్పున బాటలు వేయాలి.

● దీనివల్ల పైరుకు వెలుతురు తగిలి చీడపీడలు నివారణకు దోహదపడుతుంది.

● నారుమడి మునిగితే తీసుకోవలసిన జాగ్రత్తలు

● నారుమడిలో బాటలు వేసి నీటిని తొలగించాలి.

ఠిమొక్కలు కోలుకోవడానికి ఎకరా నారుమడికి యూరియా, పొటాష్‌ ఎరువులను 10 కేజీల చొప్పున అందించాలి.

● నారుమడికి తెగుళ్లు సోకకుండా లీటరు నీటిలో రెండు గ్రాముల కార్బన్‌డిజమ్‌, 2.5 మి.గ్రా క్లోరోపైరీపాస్‌ ద్రావణాన్ని పిచికారీ చేయాలి.

● నారుమళ్లు పూర్తిగా దెబ్బతిన్న రైతులు ప్రత్యామ్నాయంగా వెదజల్లు విధానాన్ని అవలంబించి సమయం, పెట్టుబడిని ఆదా చేసుకోవాలి.

వ్యవసాయశాఖ సూచనలు, సలహాలను తీసుకుంటే నారుమడి దెబ్బతిన్న రైతులకు ప్రయోజనకరంగా ఉంటుంది.

జూన్‌ ద్వితీయార్థంలో నారుమళ్లు చేపట్టాలి

2025 ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి జూన్‌ ద్వితీయార్థంలో నారుమళ్ల ప్రక్రియను చేపట్టి జూలై 15 నాటికి వరినాట్లు పూర్తి చేయాలని జిల్లా వ్యవసాయశాఖ చెబుతోంది. దీనివల్ల అక్టోబర్‌ నెలాఖరు నాటికి వరి కోతలు పూర్తయ్యే అవకాశం ఉంటుందని భావిస్తుంది. దీనివల్ల ఏటా నవంబర్‌ నెలలో సంభవించే ప్రకృతి వైపరీత్యాలను నుంచి తప్పించుకోవచ్చునని, మళ్లీ డిసెంబర్‌ చివరి నాటికి రబీ సాగుకు సంబంధించి వరినాట్లు పూర్తి చేస్తే వచ్చే ఏడాది మార్చి నాటికి రబీ పంట చేతికొస్తుందని, దీనివల్ల మూడవ పంటగా అపరాల సాగు చేసుకునే అవకాశం ఏర్పడుతుందని వ్యవసాయశాఖ అధికారులు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. వ్యవసాయశాఖ సూచనలు కచ్చితంగా పాటిస్తూ భూసారం పెరిగి ప్రతి ఎకరాకు మూడు నుంచి నాలుగు బస్తాలు అధిక దిగుబడి సాధించే అవకాశం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

యాజమాన్య పద్ధతులకు ప్రాధాన్యమివ్వాలి1
1/3

యాజమాన్య పద్ధతులకు ప్రాధాన్యమివ్వాలి

యాజమాన్య పద్ధతులకు ప్రాధాన్యమివ్వాలి2
2/3

యాజమాన్య పద్ధతులకు ప్రాధాన్యమివ్వాలి

యాజమాన్య పద్ధతులకు ప్రాధాన్యమివ్వాలి3
3/3

యాజమాన్య పద్ధతులకు ప్రాధాన్యమివ్వాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement