
ఇసుక లారీల వేగాన్ని నియంత్రించాలంటూ ధర్నా
రామచంద్రపురం రూరల్: ప్రమాదాలకు కారణమవుతున్న ఇసుక లారీల వేగాన్ని నియంత్రించాలని కోరుతూ వెంకటాయపాలెం, వేగాయమ్మపేట గ్రామాల సర్పంచ్లు, ప్రజలు, అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ఇసుక లారీలను అడ్డగించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటాయపాలెం గ్రామ సర్పంచ్, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ అధ్యక్షురాలు యల్లమిల్లి సతీష్కుమారి, వేగాయమ్మపేట సర్పంచ్ అంబటి తుకారం, రాష్ట్ర ఇండస్ట్రియల్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ వాసంశెట్టి శ్యామ్, అఖిల భారత రైతు కూలీ సంఘం ఉమ్మడి గోదావరి జిల్లాల నాయకుడు వెంటపల్లి భీమశంకరం, ఐఎఫ్టీయూ నాయకుడు చింతా రాజారెడ్డి తదితరులు మాట్లాడుతూ లారీలు, ముఖ్యంగా ఇసుక లారీలు మితిమీరిన వేగంతో వెళుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయని మండి పడ్డారు. ఈ నెల 28న మహిళపై నుంచి లారీ వెళ్లిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందిన ఉదంతాన్ని గుర్తు చేసుకున్నారు. ఆమె మృతితో అప్పటికే తండ్రిని కోల్పోయిన ఇద్దరు చిన్నారులు తల్లిని కూడా కోల్పోయి అనాథలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంకటాయపాలెం ప్రధాన రహదారి నుంచి వేగాయమ్మపేట, యర్రపోతవరం, యానాంలకు దగ్గరి దారిగా ఉండటంతో చీమలదిబ్బ గ్రామం నుంచి కాలువ గట్టు రహదారిపై నుంచి లారీలు రాకపోకలు సాగించడం ప్రమాదాలకు కారణమవుతోందన్నారు. ఈ రహదారి ఇరుకుగా ఉండటం రెండు పక్కలా కాలువలు ఉండటంతో అధిక బరువు కలిగిన లారీల వల్ల రోడ్డు కూడా కుంగిపోయి మరింత ప్రమాదకరంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అధిక లోడులు వేస్తున్న ఇసుక లారీలకు కనీసం బరకాలు కూడా కప్పకపోవడంతో లారీల వేగానికి ఇసుక ఎగిరి ప్రయాణికుల కళ్లల్లో పడి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని మండిపడ్డారు. ఆర్అండ్బీ అధికారులు లారీల వేగాన్ని నియంత్రించేలా స్పీడు బ్రేకర్లు ఏర్పాటు చేయాలని, చీమలదిబ్బ దారిలో లారీలు సంచరించకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనుసూరి వెంకటరమణ, ఇళ్ల సత్యనారాయణ, రాయుడు కృష్ణ, కోడి అర్జునుడు, ఇళ్ల గణపతి, అనుసూరి దుర్గ, దంగేటి జ్యోతి, ఎంపీటీసీ మాజీ సభ్యుడు దడాల రవికుమార్ పాల్గొన్నారు.