రహదారిపై మృత్యుఘోష | - | Sakshi
Sakshi News home page

రహదారిపై మృత్యుఘోష

Jun 3 2025 12:26 AM | Updated on Jun 3 2025 12:26 AM

రహదార

రహదారిపై మృత్యుఘోష

ఆధార్‌ ఇబ్బందులు

తొలగిపోతాయనుకుంటే..

మృతుడు శివన్నారాయణ కుమార్తెలు హర్షిత, వర్షితలు కవల పిల్లలు. 13వ సంవత్సరంలోకి వచ్చారు. ఇద్దరూ ఒకే రూపంలో ఉండటంతో ఆధార్‌ అయ్యేది కాదు. ఈ క్రమంలో కాకినాడలో ఇందుకు సంబంధించిన పని చేసే వారున్నారని వారికి తెలిసింది. బీచ్‌లో సరదాగా గడిపిన అనంతరం వారు హర్షిత ఆధార్‌ పని పూర్తి చేసుకోవాలని వెళ్లారు. తిరిగి వచ్చే సమయంలో ఈ కవలల్లో ఒకరు మృతి చెందగా.. మరొకరు తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. ఆధార్‌ ఇబ్బందులు తొలగిపోతాయనుకుంటే ఇలా జరిగిందంటూ వారి బంధువులు కన్నీటి పర్యంతమవుతున్నారు.

అతివేగం అనర్థదాయకమని అందరికీ

తెలిసిందే. కానీ, ఆచరణలో చూపుతున్న నిర్లక్ష్యం పలుచోట్ల ప్రమాదాలకు కారణమవుతోంది. వారం రోజుల క్రితం గామన్‌ బ్రిడ్జి హైవేపై మలుపు తిరుగుతున్న లారీని కారు ఢీకొని కొవ్వూరు ప్రాంతానికి చెందిన నలుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ కన్నీటి తడి ఇంకా ఆరక ముందే.. రంగంపేట మండలం వడిశలేరు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదు నిండు ప్రాణాలు బలైపోయాయి. ఈ రెండు ప్రమాదాలకూ ప్రధాన కారణం అతివేగమే కావడం బాధాకరం.

రంగంపేట/రాజానగరం/రాజమహేంద్రవరం రూరల్‌: అప్పటి వరకూ ఆనంద సాగరంలో ఓలలాడిన వారిని విధి చిన్నచూపు చూసింది.. కొద్దిసేపటిలో ఇంటికి చేరుకునేవారే.. అయినవారితో సంతోషంగా గడిపేవారే.. కానీ, అంతలోనే వారిపై మృత్యువు పంజా విసింది.. రహదారిపై మృత్యుఘోష ప్రతిధ్వనించింది.. రంగంపేట మండలం వడిశలేరు వద్ద ఏడీబీ రోడ్డుపై జరిగిన ఘోర ప్రమాదం రెండు కుటుంబాల్లో ఎప్పటికీ తీరని విషాదాన్ని నింపింది. అయినవారందరినీ శోక సంద్రంలో ముంచింది.

ఏం జరిగిందంటే..

ఈ ప్రమాదంలో మృతి చెందిన ఐదుగురు, గాయపడిన వారు దగ్గర బంధువులు. రాజానగరం మండలం రఘుదేవపురానికి చెందిన రేలంగి శివన్నారాయణ (40), ఆయన భార్య దేవీ లలిత (34), కుమార్తెలు వర్షిత (13), హర్షితతో పాటు.. రాజమహేంద్రవరం రూరల్‌ మండలం కవలగొయ్యి గ్రామానికి చెందిన శివన్నారాయణ బావమరిది తీగిరెడ్డి శివ (30), ఆయన భార్య భవాని, వారి కుమార్తె సాన్వి (4) కలసి కారులో సోమవారం కాకినాడ బీచ్‌కు వెళ్లారు. అక్కడ ఆనందంగా గడిపారు. తిరిగి వస్తున్న క్రమంలో వడిశలేరు గ్రామ సమీపాన హెచ్‌పీ పెట్రోలు బంకు వద్ద వారు ప్రయాణిస్తున్న కారు ఆగి ఉన్న పాల ట్యాంకర్‌ను వేగంగా ఢీకొంది. ఆ వేగానికి కారు సగ భాగం ట్యాంకర్‌లోనికి చొచ్చుకుపోయింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న శివన్నారాయణ, దేవీ లలిత దంపతులు, వారి కుమార్తె వర్షిత, తీగిరెడ్డి శివ, ఆయన కుమార్తె సాన్వి అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. వెనుక సీటులో కూర్చున్న శివ భార్య భవాని, శివన్నారాయణ కుమార్తె హర్షిత తీవ్రంగా గాయపడ్డారు. వారిని రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

కల్లు గీతపై ఆధారపడి ఈ కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. శివ తండ్రి సూరిబాబు గత ఏడాది తాటిచెట్టు పైనుంచి పడి, మంచాన ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఈ ఘోరం జరగడం ఆయా కుటుంబాలను తీవ్రంగా కలచివేస్తోంది. సరదాగా బీచ్‌కు వెళ్లి వస్తామని చెప్పి వెళ్లిన వారు ఇలా కనుమరుగైపోతారనుకోలేదంటూ మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ ప్రమాదంతో రెండు గ్రామాల్లోనూ విషాద ఛాయలు అలముకున్నాయి.

డైవర్షన్‌ గమనించలేదా?

ఏడీబీ రోడ్డును నాలుగు లైన్లుగా విస్తరిస్తున్నారు. ఈ పనుల నేపథ్యంలో వడిశలేరు హెచ్‌పీ పెట్రోల్‌ బంకు వద్ద అటుగా వెళ్లాల్సిన ట్రాఫిక్‌ను పక్క మార్గంలోకి డైవర్షన్‌ ఇచ్చారు. దీనికి కొద్ది దూరంలోనే పాల ట్యాంకర్‌ ఆగి ఉంది. ప్రమాద సమయానికి శివన్నారాయణ కారు నడుపుతున్నారు. ఆయన ఆగి ఉన్న ట్యాంకర్‌ను, డైవర్షన్‌ను గమనించకుండా వేగంగా దూసుకుని రావడం వల్లనే ఈ ఘోరం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా నుజ్జయిపోయింది. రహదారిపై డైవర్షన్‌ను గమనించి ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండకపోవచ్చని స్థానికులు భావిస్తున్నారు. మృతదేహాలను రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

వడిశలేరు వద్ద ట్యాంకర్‌ను ఢీకొన్న కారు

ఐదుగురి దుర్మరణం

ఇద్దరికి తీవ్ర గాయాలు

కాకినాడ వెళ్లి వస్తూండగా ఘోరం

రెండు కుటుంబాల్లో పెను విషాదం

అతి వేగమే బలిగొందా?

రహదారిపై మృత్యుఘోష1
1/1

రహదారిపై మృత్యుఘోష

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement