
బీచ్ కబడ్డీ పోటీలు ప్రారంభం
● సూర్యారావుపేట సాగర తీరంలో
క్రీడా సందడి
● ప్రారంభ మ్యాచ్ పురుషుల విభాగంలో తూర్పు గోదావరి జిల్లా విజయం
కాకినాడ రూరల్: కాకినాడ సాగర తీరాన క్రీడా సంబరం ఆరంభమైంది. ఏపీ కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో 12వ రాష్ట్ర స్థాయి సీనియర్ మెన్ అండ్ వుమెన్స్ అంతర జిల్లాల బీచ్ కబడ్డీ పోటీలు కాకినాడ రూరల్ మండలం సూర్యారావుపేట బీచ్లో శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. పోటీలను కలెక్టరు షణ్మోహన్, రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, కౌడా వైస్ చైర్పర్సన్ భావన, ఏపీ కబడ్డీ అసోసియేషన్ ప్రెసిడెంట్ వెంకటరెడ్డి జ్యోతి వెలిగించి ప్రారంభించారు. క్రీడాకారుల నుంచి అతిథులు గౌరవ వందనం స్వీకరించారు. పూర్వపు ఉమ్మడి జిల్లాల ప్రతిపాదికన పురుషుల 13 జట్లు, మహిళల 13 జట్లు మూడు రోజులు పాటు జరగనున్న పోటీలలో పాల్గొననున్నాయి. శుక్రవారం నుంచి ఆదివారం వరకు లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో పోటీలు జరగున్నాయి. ఫైనల్ పోరు ఆదివారం సాయంత్రం జరగనుంది. పోటీల కోసం 4 కోర్టులను ఏర్పాటు చేయడంతో పాటు ప్రేక్షకుల కోసం గ్యాలరీలను ఏర్పాటు చేశారు. ప్రారంభ మ్యాచ్గా పురుషుల విభాగంలో తూర్పు గోదావరి, చిత్తూరు జిల్లాలు తలపడగా తూర్పు గోదావరి జిల్లా విజయం సాధించింది. మహిళల విభాగంలో తూర్పుగోదావరి, శ్రీకాకుళం జట్లు తలపడగా శ్రీకాకుళం జట్టు విజయం సాధించింది.
కలెక్టర్ షణ్మోహన్ మాట్లాడుతూ బీచ్ ప్రదేశాన్ని రానున్న రెండు నెలల్లో రూ.2.5కోట్లతో అభివృద్ధి చేయనున్నట్టు చెప్పారు. ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడుతూ బీచ్ కబడ్జీ పోటీలు నిర్వహించడం గర్వంగా ఉందన్నారు. ఏపీ కబడ్డీ అసోసియేషన్ ప్రెసిడెంట్ వెంకటరెడ్డి మాట్లాడుతూ మే 15నుంచి 20వరకు మచిలీపట్నంలో జాతీయ స్థాయి పోటీలు జరుగుతాయని, రాష్ట్ర స్థాయి పోటీలలో ప్రతిభ చూపే వారిని ఎంపిక చేస్తామన్నారు. హౌసింగ్ పీడీ సత్యనారాయణ, డీఎం అండ్ హెచ్ఓ నరసింహనాయక్, జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి బి.శ్రీనివాస్కుమార్, జెడ్పీ సీఈఓ లక్ష్మణరావు, జిల్లా పంచాయతీ అధికారి రవికుమార్, డ్వామా పీడీ వెంకటలక్ష్మి, కేఎస్పీఎల్ సీఓఓ మురళీధర్, డీఆర్డీఓ పీడీ శ్రీనివాసరావు, కబడ్డీ పోటీల ఆర్గనైజింగ్ సెక్రటీ కనపర్తి నూకరాజు పాల్గొన్నారు.

బీచ్ కబడ్డీ పోటీలు ప్రారంభం