
జీజీహెచ్ మేల్ నర్సు సస్పెన్షన్
త్రిసభ్య కమిటీ విచారణ మేరకు
కలెక్టర్ నిర్ణయం
కాకినాడ క్రైం: జీజీహెచ్లో విధులు నిర్వర్తిస్తున్న కాంట్రాక్టు మేల్ నర్సు పోలాబత్తిన శ్రీనివాసరావును కలెక్టర్ షణ్మోహన్ ఆదేశాల మేరకు అధికారులు ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు. ఈ మేరకు, సస్పెన్షన్ ఉత్తర్వులు వెలువడ్డాయి. కలెక్టర్ ఆదేశాల మేరకు, జీజీహెచ్ సూపరింటెండెంట్ సూచనలతో నర్సింగ్ విభాగం అధికారులు ఈ ఉత్తర్వులను శుక్రవారం శ్రీనివాసరావుకు అందజేశారు. 2025 రిపబ్లిక్ డే పురస్కారాలకు ప్రతిభ ఆధారంగా స్వయానా కలెక్టర్ ఆమోదం మేరకు ఎంపిక అయి అవార్డులు అందుకున్న తన తోటి నర్సింగ్ సిబ్బందిని శ్రీనివాసరావు వాట్సాప్ వేదికగా తీవ్ర పదజాలంతో మహిళలు అని కూడా కనీసం గౌరవం చూపక అవమానపరుస్తూ పోస్టులు పెట్టాడని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ క్రమంలో వారిని ఎంపిక చేసిన కలెక్టర్, జీజీహెచ్ సూపరింటెండెంట్, హెచ్వోడీలు, నర్సింగ్ సూపరింటెండెంట్ల నిర్ణయాన్ని కూడా నిరాధార వ్యాఖ్యలతో తప్పుబట్టాడని ఆదేశాల్లో ప్రస్తావించారు. తాను చేసే ఆరోపణలకు నర్సింగ్ వర్గాల నుంచి మద్దతు ఉందని నమ్మించేందుకు ఖాళీ పత్రాలపై సంతకాలు సేకరించాడని, ఎందుకు ఖాళీ పత్రాలపై సంతకాలు సేకరిస్తున్నావని నర్సులు అడిగితే మన సమస్యలను ఉన్నతాధికారులకు, నాయకులకు నివేదించేందుకని నమ్మబలికాడని ఆదేశాల్లో తెలిపారు. ఏపీ ఎన్జీవో, జిల్లా నర్సింగ్ అసోసియేషన్ల సూచనలతోనే తాను ఇలా సంతకాల సేకరణ చేపడుతున్నానని నర్సులతో అన్నాడని, ఈ విషయంపై ఆయా సంఘాల నాయకులు తమకేమీ సంబంధం లేదని, తమ సంఘాల పేర్లను వ్యక్తిగత వైషమ్యాల కోసం వాడుకుంటున్నాడని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారని సస్పెన్షన్ ఆర్డర్లో ప్రస్తావించారు. సంతకాల సేకరణ ఈ ఏడాది జనవరి 30వ తేదీన రాత్రి 10.30 కి ప్రారంభించి అర్ధరాత్రి వరకు కొనసాగిస్తూ నర్సుల విధులకు శ్రీనివాస్ ఆటంకం కలిగించాడని ఆర్డర్లో పేర్కొన్నారు. సదరు ఆరోపణల నేపథ్యంలో కలెక్టర్ ఆదేశాల మేరకు డిప్యూటీ కలెక్టర్ విచారణాధికారిగా త్రిసభ్య కమిటీని నియమించి శ్రీనివాసరావుపై విచారణ నిర్వహించి వివరణ కోరామని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. విచారణలో వాస్తవాలు స్పష్టం కావడంతో పాటు సంతకాలు పెట్టిన నర్సులు, నాయకులు శ్రీనివాసరావుపై ఫిర్యాదులు చేశారని ప్రస్తావించారు. అతడి వివరణ సైతం అసంబద్దంగా ఉందని, శ్రీనివాస్ వివరణతో కూడిన విచారణ నివేదికను కలెక్టర్కు సమర్పించినట్లు ఆదేశాల్లో స్పష్టం చేశారు. విచారణలోని వాస్తవాల ఆధారంగా శ్రీనివాసరావుపై కలెక్టర్ సస్పెన్షన్ వేటుకు ఆదేశాలిచ్చారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.