
టెన్త్ టాపర్లకు కలెక్టర్ అభినందన
కాకినాడ సిటీ: పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించి, రాష్ట్ర స్థాయి, జిల్లా టాపర్లుగా నిలిచిన జిల్లా విద్యార్థులను కలెక్టర్ షణ్మోహన్ సగిలి అభినందించారు. జిల్లా విద్యా శాఖ ఆధ్వర్యాన కలెక్టరేట్లో గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో టెన్త్ పరీక్షల్లో 600 మార్కులు సాధించి, స్టేట్ టాపర్గా నిలిచిన యాళ్ల నేహాంజలిని, మండల టాపర్లుగా నిలిచిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ప్రత్యేకంగా అభినందించారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు రూ.10 వేల నగదు, ప్రేరణాత్మక పుస్తకాలను బహుమతిగా అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, విద్యార్థుల జీవితాల్లో పదో తరగతి పరీక్ష ముఖ్యమైన తొలి అంకమని, ఇందులో ఉత్తమ మార్కులతో సాధించిన విజయం జీవితంలో సమున్నత లక్ష్యాలను ఆత్మవిశ్వాసంతో అందుకోవడానికి తొలిమెట్టుగా నిలుస్తుందని అన్నారు. చిన్నప్పుడు టెన్త్ పరీక్షల్లో తాను జిల్లా టాపర్గా నిలిచానని గుర్తు చేసుకున్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులందరితో కలెక్టర్ ఆత్మీయంగా మాట్లాడారు. విద్యార్థులు ఇదే స్ఫూర్తితో తాము ఎంచుకున్న కోర్సులలో రాణించి, ఉన్నత లక్ష్యాలు అందుకోవాలని ఆకాంక్షించారు. తాము చదువుకోలేకపోయినా, పేదరికంలో ఉన్నా పిల్లలను ప్రోత్సహించిన తల్లిదండ్రులను ప్రత్యేకంగా అభినందించారు. తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయినా ధైర్యంతో చదివి, టాపర్గా నిలిచిన విద్యార్థినికి అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఒక విద్యార్థిని తల్లిదండ్రులు మాట్లాడుతూ, పెద్ద మొత్తంలో ఫీజులు చెల్లించి, ప్రైవేటు స్కూల్లో చదివించిన తమ కుమారుడి కన్నా ప్రభుత్వ పాఠశాలలో చదివించిన కుమార్తెకు మంచి ర్యాంకు వచ్చిందని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల పట్ల అపనమ్మకాన్ని విడనాడాలని కలెక్టర్ కోరారు. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన 9,108 మంది విద్యార్థులు ఫస్ట్ డివిజన్లో పాసవడం ముదావహమన్నారు. ఇది ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ బోధనా ప్రమాణాలకు దర్పణం పడుతోందన్నారు. 600కు 600 మార్కులు సాధించి రాష్ట్ర టాపర్గా నిలిచిన యాళ్ల నేహాంజలిని, ఆమె తల్లిదండ్రులను కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. ఉన్నత విద్యలో మరింతగా రాణించాలని కోరారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ జె.మనీషా, జిల్లా విద్యాశాఖాధికారి పి.రమేష్, కాకినాడ, పెద్దాపురం, డిప్యూటీ డీఈఓలు ఎన్.వెంకటేశ్వరరావు, ఐ.ప్రభాకరశర్మ, ప్రభుత్వ పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ రాజశేఖర్, డీసీఈబీ కార్యదర్శి ఎం.వెంకటేశ్వరరావు, ఎంఈవోలు, హెడ్మాస్టర్లు పాల్గొన్నారు.