
చేతికందొచ్చి.. మృత్యు తీరానికి చేరి..
అంబాజీపేట: రెండు కుటుంబాల్లో వారు చేతికి అందివచ్చిన కొడుకులు. విశాఖపట్నంలో ఉద్యోగాలు చేస్తూ కుటుంబాలకు వెన్నుదన్నుగా ఉన్నారు. సింహాచలం ప్రమాదంలో దుర్మరణం చెందారని తెలిసి అంబాజీపేట శివారు కొర్లపాటివారిపాలేనికి చెందిన ఇద్దరు యువకుల కుటుంబాల్లో విషాదం చిమ్మింది. ఈ ఘటనలో కుంపట్ల మణికంఠ ఈశ్వర శేషారావు (శివ) (26), పత్తి దుర్గా స్వామినాయుడు(33) దుర్మరణం పాలయ్యారు. వంట మేసీ్త్రగా కుటుంబాన్ని పోషిస్తున్న కుంపట్ల శ్రీనివాసరావు పెద కుమారుడు మణికంఠ ఈశ్వర శేషారావు, రైతు నాయకుడు పత్తి దత్తుడు రెండో కుమారుడు దుర్గా స్వామినాయుడు ఈ ప్రమాదంలో మృతి చెందారని తెలియగానే ఆయా కుటుంబాల్లోనే కాకుండా, అంబాజీపేటలో విషాదం నెలకొంది. చేతికి అందివచ్చిన కొడుకులు శాశ్వతంగా దూరం కావడంతో వారి తల్లిదండ్రులు, బంధువులు గుండెలవిసేలా విలపిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది. మంగళవారం రాత్రి మృతులిద్దరూ వారి తల్లిదండ్రులకు ఫోన్ చేసి, రేపు చందనోత్సవం సందర్భంగా అప్పన్న దర్శనానికి వెళుతున్నామంటూ, ఎప్పటిలాగే కబుర్లాడుకున్నారు. తెల్లారేసరికి కొడుకులు దుర్మరణం పాలయ్యారన్న సమాచారం విని ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. ఇద్దరు యువకులకు పెళ్లిళ్లు కాకపోవడంతో, వారి కుటుంబ సభ్యులు సంబంధాలు చూస్తున్నారు. ఈ సమయంలో చేదు వార్తను వినాల్సి వచ్చిందంటూ కన్నీరుమున్నీరయ్యారు.
విశాఖపట్నంలో ఉద్యోగాలు
కాగా, కుంపట్ల మణికంఠ ఈశ్వరశేషారావు (శివ) ఏడాది నుంచి విశాఖపట్నంలో మెట్రోకెమ్ కంపెనీలో ఫుడ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాడు. అతడికి తల్లిదండ్రులు శ్రీనివాసరావు, సీతామహాలక్ష్మి, సోదరుడు ఉన్నారు. తండ్రి, అతని సోదరుడు వంటలు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. సెలవు దినాల్లో అంబాజీపేట వచ్చినప్పుడు తండ్రి చేసే కేటరింగ్ వృత్తిలో సాయం చేసేవాడు. ఉద్యోగం చేస్తూ అతడు తన కుటుంబానికి అండగా ఉంటున్నాడు. ఈశ్వర శేషారావు మృత్యువాత పడటంతో ఆ కుటుంబానికి కీలకాధారం లేకుండా పోయింది. ఉద్యోగంలో స్థిరపడి కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటున్నాడని తండ్రి శ్రీనివాసరావు, తల్లి సీతామహాలక్ష్మి రోదిస్తున్నారు. మరో మృతుడు పత్తి దుర్గా స్వామినాయుడు(33) విశాఖపట్నంలో ఇంటీరియర్ డెకరేషన్ వర్కు చేస్తున్నారు. సుమారు 30 మందికి పనులు కల్పిస్తున్నాడు. అతడికి తండ్రి దత్తుడు, తల్లి వెంకటరమణ, సోదరుడు, సోదరి ఉన్నారు. ఇటీవల కాలంలోనే సోదరి వివాహాన్ని దుర్గా స్వామినాయుడు దగ్గరుండి ఘనంగా నిర్వహించారు. సంవత్సరాది పండగ నాడు కొర్లపటివారిపాలెం గ్రామ దేవత వనువులమ్మ జాతరకు ఏటా దుర్గా స్వామినాయుడు అమ్మవారి ఫొటోలతో క్యాలెండర్లను ముద్రించి, ఇంటింటికీ స్వయంగా పంచిపెట్టేవాడు. అతని మరణ వార్త విని కొర్లపాటివారిపాలెంలో విషాదం నెలకొంది. ఇంటీరియర్ వర్కుతో అందరి మన్ననలు పొందడమే కాకుండా, పలు అవార్డులను గెలుచుకున్నాడు. తండ్రి రైతు నాయకుడిగా ఉంటూ వ్యవసాయం చేస్తున్నారు. తన కుటుంబానికి ఆర్థికంగా నిలదొక్కుకునే సమయంలో దుర్గా స్వామినాయుడు శాశ్వతంగా దూరం కావడంతో ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది. పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ కొర్లపాటివారిపాలెంలోని మృతుల ఇళ్లకు వెళ్లి, వారి కుటుంబాలను పరామర్శించారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర ఎస్సీసెల్ కార్యదర్శి నేలపూడి స్టాలిన్బాబు సంతాపం ప్రకటించి, వారి కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేశారు.
విశాఖపట్నంలో ఉద్యోగాలు చేస్తూ
కుటుంబాలకు వెన్నుదన్నుగా యువకులు
సింహాచలం ఘటనలో ఇద్దరి దుర్మరణం
మృతుల కుటుంబాల్లో చిమ్మిన విషాదం
మూడోసారి జంట మరణాలు
కొర్లపాటివారిపాలెంలో జంట యువకులు మృత్యుఒడికి చేరడం ఇది మూడోసారి. 2001లో పి.గన్నవరం శివకోడు ప్రధాన పంట కాలువలో పడి ఇద్దరు మృతి చెందారు. 2008లో పుణ్య దినాలను పురస్కరించుకుని పి.గన్నవరం వైనతేయి గోదావరి నదిలో స్నానమాచరిస్తున్న ఇద్దరు యువకులు సుడిగుండంలో చిక్కుకుని మృత్యువాత పడ్డారు. తాజాగా సింహాచలం సింహాద్రి అప్పన్న దర్శనానికి వెళ్లి ఈ ఇద్దరు యువకులు తిరిగిరాని లోకాలకు చేరడంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.

చేతికందొచ్చి.. మృత్యు తీరానికి చేరి..

చేతికందొచ్చి.. మృత్యు తీరానికి చేరి..

చేతికందొచ్చి.. మృత్యు తీరానికి చేరి..