
శతాధిక వృద్ధుడి కన్నుమూత
ముమ్మిడివరం: కొత్తలంక గ్రామంలోని రమాబాయిపేటకు చెందిన దాసరి సాహెబ్(103) బుధవారం ఆయన స్వగృహంలో కన్నుమూశారు. ఆయనకు కుమారుడు, ముగ్గురు మనవళ్లు, ఓ మనవరాలు ఉన్నారు. పెద్ద మనమడు దాసరి నాగేశ్వరరావు దళిత ఉద్యమ రాష్ట్ర నాయకుడిగా వ్యవహరిస్తున్నారు. రెండో మనవడు సాయిబాబా గొల్లవిల్లి నీటి సంఘం అధ్యక్షుడిగా పని చేసి, ప్రస్తుతం అయినవిల్లి మండలం క్రాప గ్రామ సర్వేయర్గా ఉన్నారు. జీవనోపాధికి వ్యవసాయ కూలీగా పనిచేసిన సాహెబ్ కొద్ది రోజుల క్రితం వయోభారంతో అనారోగ్యానికి గురై మంచానికి పరిమితమయ్యారు. అప్పటివరకు ఆయన పనులు స్వయంగా చేసుకునేవారు. ఆయన మృతికి పలువురు సంతాపం ప్రకటించారు.
రెడ్ క్రాస్ జాతీయ
సమావేశానికి రామారావు
కాకినాడ సిటీ: రెడ్క్రాస్ ఆంధ్రప్రదేశ్ శాఖకు ఇటీవల చైర్మన్గా, జాతీయ కార్యవర్గ సభ్యుడిగా నియమితులైన వైడీ రామారావు తన తొలి సమావేశానికి హాజరుకావడానికి బుధవారం న్యూఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఈ నెల రెండున రెడ్క్రాస్ జాతీయ చైర్మన్, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా అధ్యక్షతన జరిగే సమావేశంలో తాను పాల్గొంటున్నట్టు రామారావు తెలిపారు.
160 కిలోల
సముద్ర ఉత్పత్తులు సీజ్
తాళ్లరేవు: వేట నిషేధం నిబంధనలను ఉల్లంఘించి సముద్రంలో మత్స్య సంపదను వేటాడి, విక్రయించేందుకు సిద్ధంగా ఉంచిన 160 కిలోల మత్స్య ఉత్పత్తులను మత్స్య శాఖాధికారులు బుధవారం సీజ్ చేశారు. మండలంలోని మట్లపాలెం మార్కెట్టులో సముద్ర చేపలు, రొయ్యలు విక్రయిస్తున్నట్టు అందిన సమాచారంతో జిల్లా మత్స్య శాఖాధికారి వి.కృష్ణారావు, మత్స్య శాఖ అభివృద్ధి అధికారులు జి.గోపి, కె.ప్రకాశరావు సిబ్బందితో దాడి చేశారు. వ్యాపారులు చెక్కా కృష్ణ, వైదాడి తులసి, పి.నూకరాజుకు చెందిన మత్స్య ఉత్పత్తులను సీజ్ చేశారు. ముగ్గురి వద్ద వేర్వేరుగా సముద్ర చేపలైన 60 కిలోల మెత్తళ్లు, 40 కిలోల బుంగరొయ్యలు, 60 కిలోల మెత్తళ్లు, సొరచేపలను సీజ్ చేసి, అనంతరం బహిరంగ వేలం నిర్వహించారు. వీటికి రూ.13 వేల ఆదాయం సమకూరినట్టు కృష్ణారావు తెలిపారు.