
గుడిలో చోరీ చేసి పట్టుబడ్డ దొంగ
పిఠాపురం: చేతికి గ్లౌజులు, కాళ్లకు సాక్సులు, మొహానికి మాస్క్ వేసుకుని దర్జాగా గుళ్లోకి ప్రవేశించాడు. ఎక్కడా తన ఆనవాళ్లు బయట పడకుండా జాగ్రత్త పడుతూ దేవుడి గుడిని కొల్లగొట్టాడు. దొంగిలించిన సొత్తుతో పరారవ్వడానికి ప్రయత్నించి గ్రామస్తులకు చిక్కాడు. గొల్లప్రోలు శివాలయంలో మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలివీ.. మంగళవారం తెల్లవారుజామున గొల్లప్రోలు నడిబొడ్డున ఉన్న శివాలయం గోడ దూకి ఒక వ్యక్తి పారిపోతుండగా స్థానికులు అనుమానం వచ్చి పట్టుకున్నారు. ఆరా తీస్తే అతను దొంగతనం చేసి పారిపోతున్నట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో గొల్లప్రోలు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారించగా అతను గుడిలో దొంగతనం చేసి పారిపోతున్నట్లు గుర్తించారు. అతని నుంచి గుడిలో ఉండే సుమారు రెండు కేజీల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. అతనిని గొల్లప్రోలు మండలం దుర్గాడకు చెందిన పసుపులేటి శివాజీగా గుర్తించారు. అర్ధరాత్రి శివాలయంలో ప్రవేశించి ఆలయ తలుపులు పగుల గొట్టి స్వామి వారికి అలంకరించే వెండి వస్తువులను దొంగిలించి పారిపోవడానికి ప్రయత్నించినట్లు గుర్తించారు. ఇతను గతంలో పలు చోరీ కేసుల్లో నిందితుడని పోలీసులు చెబుతున్నారు. ముందు జాగ్రత్తగా చేతికి గ్లౌజులు, కాళ్లకు సాక్సులు, మొహానికి మాస్క్ వేసుకుని దొంగతనం చేసినట్లు పోలీసులు తెలిపారు. గొల్లప్రోలు ఎస్సై ఎన్.రామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రెండు కేజీల వెండి వస్తువుల స్వాధీనం

గుడిలో చోరీ చేసి పట్టుబడ్డ దొంగ