
అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
అమలాపురం టౌన్: గడియ వేసి ఉన్న ఇళ్ల తలుపుల బోల్ట్లను తీయడంలో, ఐరన్ రాడ్లతో తలుపుల గెడలు తీయడంలో ఈ ముగ్గురు దొంగలు సిద్ధహస్తులు. ఇంట్లో వారు నిద్రిస్తుండగానే చడీ చప్పుడు లేకుండా చోరీ ముగించుకుని అక్కడ నుంచి జారుకుంటారు. తాము చోరీ చేయాల్సిన ఇంటి ప్రాంతంలో పగలు రెక్కీ నిర్వహిస్తారు. రాత్రి తాపీగా కారులో వచ్చి చోరీలకు పాల్పడుతుంటారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 32 చోరీలు చేసిన అంతర్రాష్ట్ర దొంగలు ముఠా ఇది. అమలాపురం పట్టణంలో 2023, 2024, 2025 సంవత్సరాల్లో చోరీలు చేసిన ఆ ముగ్గురి దొంగలను పట్టణ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.40 లక్షల విలువైన సొత్తును రికవరీ చేశారు. అమలాపురం ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ బి.కృష్ణారావు ఆదివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో చోరీల చిట్టాను వివరించారు. వీరి నుంచి రూ.40 లక్షల విలువైన 400 గ్రాముల బంగారు ఆభరణాలు, 500 గ్రాముల వెండి వస్తువులు, ఆరు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం పమిడిపాడు గ్రామానికి చెందిన జంగా వెంకట్రావు, అదే జిల్లా రాజుపాలెం మండలం ఉప్పలపాడు గ్రామానికి చెందిన దమ్ము సుధాకర్, గుంటూరు అర్బన్ జిల్లా శ్రీరామ్నగర్కు చెందిన కాట్ల కిషోర్బాబు అంతర్రాష్ట దొంగలు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో తాము దొంగిలించిన సొత్తును నగుదుగా మార్చుతున్న సమయంలో అమలాపురం పట్టణ పోలీసులు ఆదివారం ఉదయం అరెస్ట్ చేశారు. జిల్లా ఏఎస్పీ ఏవీఆర్పీబీ ప్రసాద్, అమలాపురం డీఎస్పీ టీఎస్ఆర్కే ప్రసాద్, పట్టణ సీఐ పి.వీరబాబుతో కలసి ఎస్పీ కృషారావు ఈ చోరీల వివరాలను వెల్లడించారు.
రాష్ట్రంలో 17 చోరీలు
తెలంగాణ రాష్ట్రం మిర్యాలగూడ, నల్గొండ తదితర ప్రాంతాల్లో చోరీలకు పాల్పడ్డ వీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 17 చోరీలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో 15 చోరీలకు పాల్పడ్డారు. మొత్తం 32 చోరీ కేసుల్లో వీరు నిందితులుగా ఉన్నారు. అమలాపురం పట్టణం గాంధీనగర్లో 2023 ఏప్రిల్లో మొదటి చోరీ, కురసాలవారివీధిలో 2024 ఆగస్టులో రెండో చోరీ, ఈ సంవత్సరం జనవరిలో మూడో చోరీ చేశారు. ఈ మూడు చోరీలకు సంబంధించి రూ.40 లక్షల సొత్తును రికవరీ చేశారు. నరసరావుపేటలో క్రికెట్ ఆటలో ఈ ముగ్గురికి పరిచయం ఏర్పడింది.
కేసును ఛేదించిన పోలీసులకు నగదు రివార్డులు
ఈ మూడు చోరీ కేసులను చాకచక్యంగా ఛేదించిన పోలీసు అధికారులు, క్రైమ్ పార్టీ సిబ్బందిని ఎస్పీ కృష్ణారావు అభినందించారు. వారికి నగదు రివార్డులు అందజేశారు. పట్టణ సీఐ పి.వీరబాబు, క్రైమ్ సీఐ ఎం.గజేంద్రకుమార్, పట్టణ ఎస్ ఎన్ఆర్ కిషోర్బాబు, క్రైమ్ ఎస్సై రాంబాబు, ఏఎస్సై అయితాబత్తుల బాలకృష్ణ, హెడ్ కానిస్టేబుళ్లు ఎంఎస్ రాజు, రమణ, కాని సాయి, శుభాకర్, ప్రసాద్, శ్రీనివాస్, అర్జున్, హరి, చిన్న ప్రసాద్లకు ఎప్పీ కృష్ణారావు నగదు రివార్డులు అందజేసి అభినందించారు.
రూ.40 లక్షల సొత్తు రికవరీ
ఎస్పీ కృష్ణారావు వెల్లడి