
గత ప్రభుత్వంలో రైతులకు ఎంతో మేలు
ఈ ప్రభుత్వం వచ్చి ఏడాది గడుస్తున్నా రైతులకు ఎటువంటి లబ్ధీ చేకూర లేదు. ఖరీఫ్ మొదలవుతోంది. ఇంతవరకూ సర్కార్ నుంచి చిల్లిగవ్వ పెట్టుబడి సాయం అందుకోలేకపోయాం. కనీసం రబీలో నష్టపోయిన పంటలకు కూడా పరిహారం ఇంతవరకూ ఇవ్వలేదు. గత ప్రభుత్వం ఖరీఫ్కు ముందు ఏటా మే నెలలో రైతుభరోసా సాయం సకాలంలో అందించేది. దీంతో పెట్టుబడికి ఢోకా ఉండేది కాదు. రైతుభరోసా కేంద్రాల్లో విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండేవి.
– యల్లపు రామ సూరి సత్యనారాయణ,
రైతు, బొద్దవరం, కోటనందూరు మండలం
ఏడాదిగా కనిపించని సంక్షేమం
కూటమి అధికారం చేపట్టిన ఏడాది కాలంలో సంక్షేమానికి దూరమయ్యాం. గత ప్రభుత్వంలో సచివాలయ వ్యవస్థ ద్వారా అధికారులు ప్రజల ఇళ్లకే వచ్చి, సంక్షేమం అందించేవారు. ప్రస్తుతం సమస్యలు పరిష్కరించాలని, సంక్షేమ పథకాలు అందించాలని ప్రజలే అధికారులు, నాయకుల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సి వస్తోంది. ఈ–గవర్నెన్స్ పేరుతో వాట్సాప్ ద్వారా 165 సేవలను అందుబాటులోకి తెస్తామన్నారు. అవి అమలు కావడం లేదు. సంక్షేమ పథకాలంటూ ఊకదంపుడు ప్రసంగాలే తప్ప ఒక్క పథకం కూడా ఆచరణలో కనిపించడం లేదు.
– నున్నం రాంబాబు,
గోకవరం మండలం

గత ప్రభుత్వంలో రైతులకు ఎంతో మేలు