
రత్నగిరికి పోటెత్తిన భక్తులు
అన్నవరం: రత్నగిరికి గురువారం భక్తులు వేలాదిగా పోటెత్తారు. పెద్ద సంఖ్యలో పెళ్లిళ్లు జరగడంతో నవదంపతులు, వారి బంధుమిత్రులకు ఇతర భక్తులు తోడవడంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. సాయంత్రం 4 గంటల వరకూ రద్దీ కొనసాగింది. సత్యదేవుని సుమారు 40 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. వ్రతాలు 2,100 జరిగాయి. ఉచిత దర్శనానికి గంట, ప్రదక్షిణ దర్శనానికి అరగంట పట్టింది. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. నిత్యాన్నదాన పథకంలో 5 వేల మంది భక్తులు సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారు. సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారు, శంకరులు నిజరూపంలో దర్శనమిచ్చారు. రత్నగిరి వనదేవత వనదుర్గ అమ్మవారికి శుక్రవారం ఉదయం 9 గంటలకు చండీహోమం నిర్వహిస్తారు. ఆసక్తి ఉన్న భక్తులు రూ.750 టికెట్టుతో హోమంలో పాల్గొనవచ్చని అధికారులు తెలిపారు.
వెన్నుపోటు దినంతో
ప్రభుత్వానికి కనువిప్పు కలిగిద్దాం
తుని రూరల్: ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చకుండా మోసగిస్తున్న టీడీపీ ప్రభుత్వానికి వెన్నుపోటు దినంతో కనువిప్పు కలిగిద్దామని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా అన్నారు. ఎస్.అన్నవరంలోని తన క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన నియోజకవర్గ నాయకులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు వచ్చే నెల 4న నిర్వహించనున్న వెన్నుపోటు దినం కార్యక్రమంపై నాయకులు, కార్యకర్తలతో చర్చించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి, ప్రజలకు న్యాయం చేసేలా పోరాటం చేద్దామని అన్నారు. నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయకుండా రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ, అక్రమ కేసులు పెట్టడమే లక్ష్యంగా కూటమి పాలన సాగుతోందని విమర్శించారు. ఇటువంటి అరాచకాలను ఎండగట్టేందుకు నాయకులు, కార్యకర్తలు ప్రజలను భాగస్వాముల్ని చేయాలన్నారు. సమావేశంలో నాయకులు లాలం బాబ్జీ, రేలంగి రమణగౌడ్, రాయి మేరీ అవినాష్, చోడ్రాజు రామచంద్రరాజు, సకురు నాగేంద్ర నెహ్రూ, నాగం దొరబాబు, నాగం గంగబాబు, గొర్లి రామచంద్రరావు, సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు.
పదోన్నతులకు
ఉపాధ్యాయుల నిరీక్షణ
రాత్రి 7 దాటినా నిర్వహించని వైనం
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): స్కూల్ అసిస్టెంట్లకు గ్రేడ్–2 ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతులు కల్పించడానికి చేపట్టిన కౌన్సెలింగ్ గురువారం రాత్రి ఏడు గంటలు దాటినా ప్రారంభం కాలేదు. దీంతో, ఉపాధ్యాయులు కౌన్సెలింగ్ కేంద్రం వద్దనే గంటల తరబడి పడిగాపులు పడ్డారు. పదోన్నతుల కౌన్సెలింగ్కు ఉదయం 9 గంటలకే స్థానిక సాలిపేట బాలికల ఉన్నత పాఠశాలకు రావాలని సమాచారం ఇవ్వడంతో అందరూ ఉదయమే అక్కడకు చేరుకున్నారు. షెడ్యూల్ ప్రకారం బుధవారం ఈ కౌన్సెలింగ్ నిర్వహించాల్సి ఉండగా ఆప్షన్ల నమోదులో జాప్యం చోటు చేసుకుంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 96 మంది జిల్లా పరిషత్, 16 మంది ప్రభుత్వ, ఏడుగురు మున్సిపల్ పాఠశాలలల్లో ఉద్యోగోన్నతి పొందనున్నారు. తీవ్ర ఆలస్యంగా ప్రారంభమైన ఈ కౌన్సెలింగ్ రాత్రి సుమారు 10 గంటల సమయానికి పూర్తయ్యింది.
బదిలీలకు 8,836 మంది ఉపాధ్యాయుల దరఖాస్తు
రాయవరం: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లావ్యాప్తంగా బదిలీల కోసం 8,836 మంది ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకున్నారు. కంపల్సరీ దరఖాస్తులతో పాటు, ఇష్టపూర్వకంగా ఉన్న వారు కూడా దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు 245, పీఎస్ హెచ్ఎంలు 215, ఎల్పీ హిందీ 41, ఎల్పీ సంస్కృతం 3, ఎల్పీ తెలుగు 93, ఎల్పీ ఉర్దూ 3, పీఈటీలు 42, ఎస్ఏ తెలుగు 524 మంది, ఎస్ఏ ఇంగ్లిష్ 729, ఎస్ఏ హిందీ 396, ఎస్ఏ సంస్కృతం 9, ఎస్ఏ ఉర్దూ 2, ఎస్ఏ బయలాజికల్ సైన్స్ 479, ఎస్ఏ గణితం 873, ఎస్ఏ ఫిజికల్ సైన్స్ 615, ఎస్ఏ సోషల్ స్టడీస్ 471, ఎస్ఏ ఫిజికల్ డైరెక్టర్ 260, ఎస్ఏ స్పెషల్ ఎడ్యుకేషన్ 10, సెకండరీ గ్రేడ్ టీచర్లు 3,826 మంది ఉన్నారు.

రత్నగిరికి పోటెత్తిన భక్తులు

రత్నగిరికి పోటెత్తిన భక్తులు