
విశిష్టమైనది సర్వ పృష్ఠ ఆప్తోర్యామ యాగం
అంబాజీపేట: లోక కళ్యాణాన్ని ఆకాంక్షిస్తూ 60 ఏళ్ల క్రితం నిర్వహించిన సర్వ పృష్ఠ ఆప్తో ర్యామ యాగాన్ని నిర్వహిస్తున్నట్లు టీటీడీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ప్రాజెక్టు అధికారి దువ్వూరి ఫణి యజ్ఞేశ్వర యాజులు చెప్పారు. తొండవరంలో వైనతేయ నది తీరాన వేంచేసి ఉన్న శ్రీ ఉమా తొండేశ్వర స్వామి ఆలయ ప్రాంగణ సమీపంలో ఆదివారం సర్వ పృష్ఠ ఆప్తోర్యామ యాగం ప్రారంభమైంది. యాగకర్తలుగా దువ్వూరి వెంకట సూర్యప్రకాశ యజ్వ, కనకదుర్గ సోమపీధిని దంపతులు వ్యవహరిస్తున్నారు. యాగ విశిష్టతను ప్రాజెక్ట్ అధికారి యాజులు మాట్లాడుతూ అగ్నిదేవుని ద్వారా సమస్త దేవతలకు హవిస్సు భాగం అందించేందుకు సర్వ పుష్ఠ ఆప్తోర్యామ యాగం ఉపయోగపడు పడుతుందన్నారు. యాగంలో (మహాగ్నిచయనం) భాగంగా ప్రత్యేక ఆకారాలు కలిగిన వేయి ఇష్టకాలను (ఇటుకలను) ప్రత్యేక మంత్రాలతో అమర్చుతామని, ఇలా పేర్చిన ఇటుకలన్నీ గరుడ పక్షి ఆకారాన్ని సంతరించుకుంటాయని యాజులు వివరించారు. ఈ యాగంలో సమస్త దేవతలను ఆహ్వానించి వివిధ హోమద్రవ్యాలతో వారికి హవిస్సు భాగాన్ని అందిస్తామన్నారు. ఇలాంటి యాగం తన తాత అయిన దువ్వూరి యజ్ఞేశ్వర ఫౌండరీక యాజులు 60 ఏళ్ల క్రితం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురంలో నిర్వహించారని, ఇన్నాళ్లకు తన తండ్రి అయిన సూర్య ప్రకాశ సోమయాజులు నిర్వహించడం ఎంతో అరుదైన విషయమన్నారు. ఈ యాగంలో నమక చమకాలతో హోమం చేసి, పురుష సూక్తాలతో పరమాత్మను ధ్యానం చేస్తామన్నారు. ఈ క్రతువులో శతరుద్రీయహోమం (నమక ప్రశ్న) వల్ల ఘోర తనుశాంతి, వసోర్ధారా హోమం (చమక ప్రశ్న) వల్ల శాంతమైన తనువుకు ప్రీతి కలుగుతుందని యాజులు వివరించారు.
అమావాస్య నాడు
యాగ ప్రారంభం ఎంతో శక్తివంతం
ఎంతో విశేషమైన సర్వ పృష్ఠ ఆప్తోర్యామ యాగాన్ని చైత్ర బహుళ అమావాస్య రోజున ప్రారంభించడం వల్ల ఎంతో శక్తివంతంగా మారుతుందని, కోరికలన్నీ ఈడేరుతాయని యాజులు వివరించారు. సమస్త మానవాళి సుఖశాంతులతో ఉంటారని, వారి కోరికలన్నీ సిద్ధిస్తాయని, ముఖ్యంగా తమిళనాడులో ఏ పనైనా అమావాస్య నాడే ప్రారంభించి విజయవంతంగా ముగిస్తారన్నారు. సమస్త దేవతలకు కూడా హవిస్సు కేటాయిస్తారన్నారు. 10 రోజుల పాటు జరిగే ఈ యాగంలో వివిధ కార్యక్రమాలు, క్రతువులు ఉంటాయన్నారు.
టీటీడీ ఉన్నత వేదాధ్యయన సంస్థ
ప్రాజెక్ట్ అధికారి యజ్ఞేశ్వర యాజులు